ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’

‘ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ దాన్ని అంగీకరించాల్సిందేనని దానర్థం కాదు. విభేదిస్తే నిజాయితీగా అభిప్రాయం తెలపాలి’
అభిప్రాయ భేదాలు ఉండడంలో తప్పులేదనీ, వాటిని నిజాయితీగా స్వీకరించగలగాలనీ ధోనీ చెప్పారు. అక్టోబర్ 2, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలూ, సిద్ధాంతాల గురించి క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడారు. గాంధీజీ విధానాలు తన జీవితంపై ఎంతో ప్రభావం చూపాయని ఆయన అన్నారు.
బీబీసీ న్యూస్ హిందీ జర్నలిస్టు సునందన్ లెలేకు ధోనీ ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివీ:
ఎంఎస్ ధోనీ: ‘నేను అనుసరించేదీ గాంధీ మార్గమే’
నేను అనుసరించే విధానం..
‘‘అహింస, నిజాయితీ, మనోబలం, ఖచ్చితత్వం, దేన్నైనా సాధించే దాకా వదిలిపెట్టని పట్టుదల.. ఇవన్నీమహాత్మా గాంధీలో ఉన్న ఉత్తమ లక్షణాలు. గాంధీ పేరు వినగానే ఈ మాటలన్నీ నాకు గుర్తొస్తాయి. ఓ మంచి వ్యక్తిత్వాన్ని తక్కువ పదాల్లో వర్ణించాలంటే గాంధీ పేరు చెబితే చాలు.’’
‘‘గాంధీ విధానాల్లో కొన్ని నా ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించాయి. వాటి గురించి నేను చాలాసార్లు చెబుతుంటాను. ‘నేను నా ప్రస్తుత జీవితంపైనే దృష్టి పెడతాను. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. గతంలో జరిగిపోయిందేదో జరిగిపోయింది. జరగబోయేది మన చేతిలో లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్నదాని మీద మనకు పూర్తి నియంత్రణ ఉంటుంది. మనమేం చేసినా దాన్ని పూర్తి అంకితభావంతో, నిబద్ధతతో చేస్తే భవిష్యత్తుపై దాని సానుకూల ప్రభావం తప్పకుండా ఉంటుంద’న్నది గాంధీ సూచించిన జీవన విధానాల్లో ఒకటి. నాకు బాగా నచ్చి అనుసరించే విధానం ఇది.’’
ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR
‘గాంధీ ప్రభావం నా జీవితంపైన చాలా ఉంది’
నిబద్ధతే సంపూర్ణ విజయం
‘‘నేడు ప్రపంచం ఫలితాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఒక విద్యార్థి గురించి మాట్లాడినప్పుడు మార్కుల గురించే ఆలోచిస్తున్నారు. ఒక విద్యార్థికి 90 శాతం మార్కులొస్తే గొప్ప విద్యార్థని అంటున్నారు. కానీ నా దృష్టిలో పూర్తి నిబద్ధతే సంపూర్ణ విజయం. నేను నా వైపు నుంచి అన్ని ప్రయత్నాలూ చేస్తే, మనసుపెట్టి కృషి చేస్తే, ఆ తరవాత ఫలితమెలా ఉన్నా దాన్ని అంగీకరించాలి. ఫలితాలను బట్టి ప్రయత్నాలను అంచనా వేయకూడదు. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంతే విజయం దక్కుతుంది.’’
‘‘ఒక జట్టు గురించి నేను కెప్టెన్గా మాట్లాడాలంటే.. నిజాయితీతో కూడిన అభిప్రాయ భేదాలు ఉండాలంటాను. జట్టు సభ్యుల ఎంపిక విషయంలో చాలాసార్లు అస్పష్టత ఉంటుంది. కొన్నిసార్లు సీనియర్ ఆటగాళ్ల సలహా తీసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు జూనియర్ ఆటగాళ్లు సలహాలిస్తుంటారు. ఒక కెప్టెన్గా ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ దాన్ని అంగీకరించాల్సిందేనని దానర్థం కాదు. విభేదిస్తే నిజాయితీగా అభిప్రాయం తెలపాలి.’’
ఫొటో సోర్స్, Getty Images
‘భవిష్యత్తు గురించి నేనెప్పుడూ ఆలోచించను’
నిజాయితీ ముఖ్యం
‘‘కెప్టెన్గా కాకుండా ఒక ఆటగాడిగా మాట్లాడాలంటే... ఒక జట్టులో ఒక ఆటగాడికి బదులు మరో ఆటగాడిని ఎంచుకుంటే ఆ ఆటగాడు బాగా ఆడతాడనీ, దాని వల్ల టీం పరిస్థితి మెరుగవుతుందనీ అర్థం. అందుకే ఎవరికి ఎలాంటి అభిప్రాయ భేదాలున్నా అవి నిజాయితీగా ఉండాలని అంటాను.’’
‘‘జట్టు విషయంలో నిర్ణయాత్మక వ్యక్తితో పాటు, ఆ టీంలో ఉన్న సభ్యులందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటూనే నిజాయితీగా భిన్నాభిప్రాయాన్ని తెలిపే అవకాశాన్ని అందరికీ కల్పించాలి. నా దృష్టిలో అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే దాని సానుకూల ప్రభావం జట్టుపైన తప్పకుండా పడుతుంది. వ్యాపార సంస్థలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.’’
మా ఇతర కథనాలు:
- కిట్ కొనడానికి కష్టపడ్డ మిథాలీ.. ఇప్పుడు పారితోషికంలో టాప్
- ద్రవిడ్ గురించి ఆయన భార్య విజేత ఏమన్నారు?
- నెహ్రా నీ స్వింగ్ను ఎలా మరిచిపోగలం
- ఇకపై టెస్టు మ్యాచ్ నాలుగు రోజులేనా?
- BBC SPECIAL: అంధులు క్రికెట్ ఎలా ఆడతారు?
- ‘గాంధీ హరిజనులకు శత్రువు’
- మహిళల క్రీడా దుస్తులు: నాడు, నేడు
- బీబీసీ 100 మంది మహిళలు: 4 సమస్యలపై పోరు
- బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా సంస్థా?
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్లోనూ సబ్స్క్రైబ్ చేయండి.)