చిత్తూరు: సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు మృతి

చిత్తూరు

ఫొటో సోర్స్, Giri/BBC

చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం, మొరం గ్రామంలో శ్రీ వేంకటేశ్వర హేచరీస్ (కోళ్ల ఫారం)లో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేసే క్రమంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు.

పలమనేరుకు ఆరు కిలోమీటర్ల దూరంలో కుప్పం వెళ్లే దారిలో వేంకటేశ్వర హేచరీస్ ఉంటుంది.

మొత్తం ఎనిమిది మంది సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేయడానికి అందులోకి దిగారనీ, వారిలో ఏడుగురు మృతి చెందారని చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర బాబు బీబీసీకి తెలిపారు.

అపస్మారక స్థితిలో ఉన్న ఎనిమిదో వ్యక్తి శివకుమార్ రెడ్డి (46)ని తిరుపతికి తరలించినట్టు ఓ పోలీసు అధికారి చెప్పారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

ట్యాంకుకు రెండు మూతలు ఉన్నాయని, కార్మికులు రెండో మూతను తెరవకుండానే ఒక మూతలోంచి లోపలికి దిగినట్టు అధికారులు చెప్పారు.

హేచరీస్ వ్యర్థాలు నిల్వ చేసే గుంత 12 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతు ఉందని తెలుస్తోంది.

వీడియో క్యాప్షన్,

సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు మృతి

ఇలా మనుషులను సెప్టిక్ ట్యాంకులోకి దించడానికి హేచరీస్‌ సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకుందా లేదా అనే విషయం నిర్ధారించాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు.

మృతుల పేర్లు: 1) ఎం. రమేష్ (32), 2) జి. కుమారస్వామి (35), 3) బి. రామచంద్ర (23), 4) ఎ. రెడ్డప్ప (30), 5) ఆర్. బాబు (30), 6) కేశవ (20), 7) బి. వెంకటరాజు (23).

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)