మాదాల రంగారావు: 'తెలుగు వెండితెరకు ఎర్ర రంగు అద్దిన తొలి హీరో'
- వెంకట కిషన్ ప్రసాద్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Madala Ravi
తెలుగు సినీరంగంలో 'రెడ్ స్టార్'గా పిలిచే మాదాల రంగారావు (69) ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాదాలను కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో చేర్పించినప్పుడు ఆయన కుమారుడు డాక్టర్ మాదాల రవితో బీబీసీ మాట్లాడింది.
"ఏడాది కిందటే ఆయనకు గుండె పోటు వచ్చింది. అప్పుడు చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాం. ఆ తర్వాత హైదరాబాద్కు తీసుకొచ్చాం. అప్పుడు గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది. మళ్లీ ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది" అని రవి చెప్పారు.

ఫొటో సోర్స్, Madala Ravi
'తొలి ఎర్ర హీరో రంగారావే'
1980లో మాదాల రంగారావు నిర్మించిన తొలి సినిమా 'యువతరం కదిలింది' ఆనాటికి ఓ సంచలనం. అప్పటి వరకు ఎక్కువగా పగ-ప్రతీకారాలు, ప్రేమ వంటి అంశాలే కథావస్తువులుగా కొనసాగుతున్న తెలుగు సినిమాను ఆయనో మలుపు తిప్పారు.
ఒంగోలు సమీపంలోని మైనంపాడు గ్రామం ఆయన జన్మస్థలం.
"పుట్టింది 'అగ్ర' కుల, భూస్వామ్య కుటుంబంలో అయినప్పటికీ బాల్యం నుంచే ఆయన పేద, బడుగుల జీవితాల గురించి ఆలోచించేవారు" అని సీనియర్ కళాకారుడు నల్లూరి వెంకటేశ్వర్లు బీబీసీతో చెప్పారు.
‘‘ఆనాటికి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉండడమే దీనికి నేపథ్యం’’ అని అన్నారు.
ప్రజానాట్యమండలికి చెందిన నల్లూరికి మాదాల రంగారావుతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన నిర్మించిన చాలా చిత్రాల్లో నల్లూరి నటించారు.
భుజానికి ఓ జోలెసంచి వేలాడేసుకొని తెల్లటి లాల్చీ, పైజామాలో కనిపించే నల్లూరి 'మాస్టారు' పాత్ర మాదాల తీసిన ప్రతి సినిమాలోనూ ఉండేదంటే అతిశయోక్తి కాదు.
దీనిపై నల్లూరి మాట్లాడుతూ.. "అప్పటి వరకు నాటకాలు వేయడం, వేయించడం మాత్రమే తెలిసిన నన్ను సినిమాల్లోకి లాగింది రంగారావే. నీతో ఎలాగైనా సినిమాల్లో వేషాలు వేయిస్తా అంటూ ప్రతి సినిమాలోనూ నాకోసం ఓ పాత్రను సృష్టించే వాడాయన" అని గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Madala Ravi
శ్రీశ్రీతో దోస్తీ
ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడే ఆయన కమ్యూనిస్టు భావజాలంవైపు మొగ్గుచూపడం ప్రారంభమైందని నల్లూరి తెలిపారు.
హాస్టల్లో ఉంటున్న సమయంలో ఆయన తన మిత్రబృందంతో కలిసి తరచూ నాటకాలు వేసేవారని, వారు వేసిన నాటకాలకు బాగా ప్రజాదరణ లభించిందని ఆయన చెప్పారు.
"అప్పుడే ఆయన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో చేరారు. ఆ రోజుల్లో ఒంగోలులో ఏఐఎస్ఎఫ్ బలంగా ఉండేది."
"ఆ అబ్బాయి హైస్కూల్లో చదివేటప్పటి నుంచే నాకు బాగా పరిచయం. శర్మ కాలేజీలో సాంస్కృతిక కార్యకలాపాలు బాగా జరుగుతుండేవి. నేనూ వారితో నాటకాలు వేయించేవాడిని."
"మాదాల బృందం వేసిన 'సంభవామీ యుగే యుగే' అనే నాటకం చాలా ప్రజాదరణ పొందింది. దాన్ని దాదాపు 60-70 సార్లు వేశాం. తమిళంలో చో రామస్వామి రాసిన నాటకం దానికి మూలం. బొల్లిముంత శివరామకృష్ణ దాన్ని తెలుగీకరించారు. ‘భారతదేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటోంది. దేశం కాంట్రాక్టర్ల రాజ్యంగా మారిపోతోంది’ అనేది ఆ నాటకంలో విషయం. రంగారావు విష్ణుమూర్తి వేషం వేసేవారు."

ఫొటో సోర్స్, Madala Ravi
"ఆ తర్వాత ఆయన విశాఖ వెళ్లి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏలో చేరారు. నీలం రాజశేఖర్ రెడ్డితో ప్రబావితుడై ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరారు" అని నల్లూరి తెలిపారు.
"ఆ తర్వాత మాదాల చెన్నై వెళ్లి సొంతంగా సినిమాలు తీసే ప్రయత్నాలు ప్రారంభించారు. మిత్రుల సహకారంతో ఆయన 'యువతరం కదలిగింది' సినిమా తీశారు. అది 100 రోజులు ఆడింది. ఆ తర్వాత 'ఎర్రమల్లెలు' తీశారు. అదీ 100 రోజులు ఆడింది. ఆ తర్వాత 'విప్లవశంఖం', 'ప్రజాశక్తి', 'మహా ప్రస్థానం' ఇలా 8-9 సినిమాలు చేశారు. అయితే వాటిలో కొన్ని అంతగా ఆడలేదు" అన్నారు నల్లూరి.
"ప్రముఖ కవి శ్రీశ్రీ పాటలు మాదాల సినిమాలో ఎక్కువగా ఉండేవి. ఆయన మాదాలకు చాలా సన్నిహితుడు, స్నేహితుడు. మాదాలకు శ్రీశ్రీ అండదండలు లభించాయి. మహాప్రస్థానం సినిమాకు మాటలు కూడా ఆయన శ్రీశ్రీతోనే రాయించారు" అని నల్లూరి తెలిపారు.
సినిమాలను స్టూడియోల్లో కాకుండా మొత్తంగా ఔట్డోర్లోనే పూర్తి చేసే ఓ కొత్త సాంప్రదాయానికి కూడా మాదాల పునాది వేశారని ఆయనన్నారు.
"ఆయన తీసిన కొన్ని సినిమాలు ఒంగోలు పరిసర గ్రామాల్లోనే షూట్ చేశారు. వారికి గ్రామస్థుల సహకారం లభించడమే కాదు. సినిమాకు అవసరమైన కొన్ని పాత్రలు కూడా గ్రామస్థులే స్వచ్ఛందంగా వేసేవారు."

ఫొటో సోర్స్, Madala Ravi
'విప్లవ శంఖం' చూసిన నాటి రాష్ట్రపతి నీలం
మాదాల వరుసగా 'విప్లవ' సినిమాలు తీస్తుండడంతో సెన్సార్ బోర్డు నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆయన 1982లో నిర్మించిన 'విప్లవ శంఖం' సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించింది. దాంతో ఈ సినిమాలో కొన్ని కత్తిరింపులు కూడా చేయాల్సి వచ్చింది.
"ఆ తర్వాత మేం దిల్లీకి వెళ్లి ఈ సినిమాను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి చూపించాం" అని నల్లూరి తెలిపారు.

ఫొటో సోర్స్, Madala Ravi
"ఆయన నాతో పాడించకపోతే నేనెక్కడ?"
మాదాల రంగారావు తీసిన సినిమాలకు ఎలా ప్రత్యేకత ఉందో ఆయన సినిమాల్లో పాటలూ అంతే ప్రత్యేకం.
గ్రామసీమల్లో జనాలు పాడుకునే పాటల బాణీలే మాదాల సినిమాలకు పేరు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో 1980-90 దశకాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాటలు బాగా ప్రజాదరణ పొందాయి.
మాదాల సినిమాల్లో పాటల ప్రత్యేకత గురించి ప్రముఖ సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్తో బీబీసీ మాట్లాడింది.
"మాదాల తన కోసం కాకుండా ప్రజల కోసమే సినిమాలు తీశారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సినిమాలకు నన్ను పరిచయం చేసింది ఆయనే. ఆయనతో నాది నలభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం" అని వందేమాతరం అన్నారు.
మాదాల నిర్మించిన 'స్వరాజ్యం' సినిమాలో తొలిసారి పాడిన ఆయన ఇప్పటి వరకు 3000కు పైగా పాటలు పాడారు.
"మాదాల లేకపోతే గాయకుడిగా, సంగీత దర్శకుడిగా నేను లేను" అని వందేమాతరం చెప్పారు.

ఫొటో సోర్స్, Madala Ravi
'అడవిలో పూసే ఎర్రపూలను సినిమా వనంలో పూయించాడు'
'భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాల దోపిడీ, దౌర్జన్యాల పట్ల అట్టడుగు సమూహాల్లో ఉండే ఆగ్రహావేశాలను తెరపైకి ఎక్కించడం ద్వారా మాదాల ఓ కొత్త ట్రెండ్ సృష్టించారు' అని సీనియర్ పాత్రికేయుడు శ్రీరామమూర్తి అన్నారు.
"ఆనాటికి సోషలిస్టు, సమానత్వ భావాలతో కొందరు సినిమాలు తీసినప్పటికీ సెల్యులాయిడ్పై ఎర్ర జెండా చేత పట్టుకున్న తొలి హీరో మాత్రం రంగారావే."
ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు భావజాలమే ఆయనలోని కళకు సానపెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఆయన సాధారణ తెలుగు ప్రేక్షకులకు 'ఎర్ర' స్పృహ కలిగించారు. ఆ తర్వాత నారాయణమూర్తి లాంటి వారికి ఆయన ట్రెండ్ సెట్టర్గా నిలిచారు" అని శ్రీరామమూర్తి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా విప్లవ చరిత్రను కళ్లకు గట్టే పోస్టర్లు
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు నేలపై అక్టోబర్ విప్లవం
- గ్రౌండ్ రిపోర్ట్: ‘లెనిన్, స్టాలిన్ అందరూ పోవాల్సిందే’
- విజయవాడలోని ఈ కమ్యూనిస్టుల విగ్రహాలు ఏం చెబుతున్నాయి?
- ‘స్టాలిన్ మృతి’: బ్రిటిష్ కామెడీ సినిమాపై మండిపడుతున్న రష్యా
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- క్యూబాలో క్యాస్ట్రోల 60 ఏళ్ల పాలనకు తెర
- పెరియార్: విగ్రహాలు మన ఆలోచనలను ఏం చేస్తాయంటే..
- 'సీపీఎం సభలు పూర్వ వైభవానికి దారులు వేస్తాయా?'
- చార్లీ చాప్లిన్: కష్టాలను దిగమింగి.. ప్రపంచాన్ని నవ్వించాడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)

వీడియో, రష్యా విప్లవం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపింది?
వందేళ్ల క్రితం ఉవ్వెత్తున ఎగిసిన రష్యా విప్లవం అనేక దేశాలపై ప్రభావం చూపింది. తమ జీవితాలపై అది ఎలాంటి ప్రభావం చూపిందో వివిధ దేశాల ప్రజలు ఇలా గుర్తు చేసుకున్నారు.