హక్కుల కార్యకర్తలపై కేసు: పోలీసుల ప్రెస్‌మీట్‌పై బాంబే హైకోర్టు అసంతృప్తి

సుధా భరద్వాజ్ లేఖ

ఎల్గార్ పరిషత్, భీమా కోరేగావ్ కేసుల్లో నిందితులకు సంబంధించి ఇటీవల మహారాష్ర్ట పోలీసులు నిర్వహించిన ప్రెస్ మీట్‌పై బాంబే హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ కేసు విచారిస్తున్న ఇతర అధికారులతో కలిసి మహారాష్ర్ట అదనపు డీజీపీ పరంబీర్ సింగ్ శుక్రవారం విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పత్రాలను చూపుతూ.. నిందితులకు సంబంధించి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో సతీశ్ గైక్వాడ్ ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా బాంబే హైకోర్టులో.. '' పోలీసులు ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడటం, ఆధారాలను బయటపెట్టడం వంటి అంశాలను ప్రస్తావించాం'' అని పిటిషనర్ తరఫు న్యాయవాది నితిన్ సత్పుతే చెప్పారు.

స్పందించిన కోర్టు.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నపుడు పోలీసులు ఇదే అంశంపై మీడియా ముందుకు ఎలా వెళ్తారని ప్రశ్నించినట్లు నితిన్ వివరించారు. ఈ సందర్భంగా కోర్టు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు.

జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మృదులా భత్కర్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది.

తదుపరి వాదనను సెప్టెంబరు 7కి వాయిదా వేశారు.

ఇటీవల పుణే పోలీసులు వరవరరావు, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్ తదితర అయిదుగురు హక్కుల కార్యకర్తలను భీమా కోరేగావ్ హింసకు సంబంధించిన కేసులో అరెస్ట్ చేశారు.

అనంతరం సుప్రీం కోర్టు.. నిందతులను పోలీసు కస్టడీ నుంచి తప్పించి సెప్టెంబరు ఆరువరకు గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)