ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా.. కేసీఆర్ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది?

  • రవిశంకర్ లింగుట్ల
  • బీబీసీ ప్రతినిధి
మమతా బెనర్జీ, కేసీఆర్, నవీన్ పట్నాయక్
ఫొటో క్యాప్షన్,

మమతా బెనర్జీ, కేసీఆర్, నవీన్ పట్నాయక్

కాంగ్రెస్, బీజేపీలపై ఆధారపడని ఫెడరల్ ఫ్రంట్(సమాఖ్య కూటమి) ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెబుతున్నారు. ఈ కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.

కేసీఆర్ ఆదివారం బిజూ జనతాదళ్(‌బీజేడీ) అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను, సోమవారం తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేతలు అఖిలేశ్ యాదవ్, మాయావతిలతోనూ భేటీ కానున్నారు.

వివిధ పార్టీల నాయకులతో కేసీఆర్ వరుస సమావేశాలు, కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చ ఊపందుకుంటోంది. బీజేపీ లేదా కాంగ్రెస్ భాగస్వామ్యంగాని, బయటి నుంచి మద్దతుగాని లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమా, కాదా అనే అంశం మరోసారి చర్చనీయమైంది.

ఏదైనా పార్టీ లేదా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే లోక్‌సభలో 543 స్థానాలకుగాను కనీసం 272 స్థానాలు ఉండాలి.

బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలతో కూడిన కూటమి ఏదైనా ఈ '272' మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోగలదా అనే ప్రశ్నే మౌలికమైనది.

స్థూలంగా చెబితే బీజేపీ, కాంగ్రెస్ రెండూ గెలిచిన స్థానాల మొత్తం 272కు లోపు ఉండి, కనీస మెజారిటీకి అవసరమైన స్థానాలను గెలుచుకొన్న పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తేనే బీజేపీ, కాంగ్రెస్ ప్రమేయం లేని ప్రభుత్వం ఏర్పడగలదు. ఇది ఆచరణలో సాధ్యమవుతుందా, కాదా?

డిసెంబరు 10న దిల్లీలో జరిగిన విపక్షాల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ దేవెగౌడ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, డీఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తదితరులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

డిసెంబరు 10న దిల్లీలో జరిగిన విపక్షాల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, డీఎంకే అగ్రనేత ఎంకే స్టాలిన్, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తదితరులు

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ప్రొఫెసర్ చంగవల్లి శివరామమూర్తి బీబీసీతో మాట్లాడుతూ- ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన మంచిదేనని, కానీ కాంగ్రెస్, బీజేపీ ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమని చెప్పారు. దీనిని ముందుకు తీసుకెళ్లడంలో చాలా అవరోధాలున్నాయనీ అభిప్రాయపడ్డారు.

''ఈ కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారు, అజెండా ఏమిటి, భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం, సుస్థిర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగించడం, ఎన్నికల తర్వాత కూడా భాగస్వామ్య పక్షాలన్నీ ఐక్యంగా ఉండగలగడం లాంటి అంశాల్లో కూటమికి సవాళ్లు ఉన్నాయి'' అని ఆయన చెప్పారు.

తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ, బీఎస్‌పీ- ఇలా వివిధ పార్టీల మధ్య రాజకీయ, ఆర్థిక విధానాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, ఇవి కూడా కూటమికి అవరోధాలుగా నిలుస్తాయని ప్రొఫెసర్ మూర్తి అభిప్రాయపడ్డారు.

దేశంలోని ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, వాస్తవిక దృష్టితో చూస్తే బీజేపీ లేదా కాంగ్రెస్ భాగస్వామ్యంగాని, మద్దతుగాని లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమయ్యే అవకాశాలు లేవని సామాజిక, రాజకీయ విశ్లేషకుడు తుంగ లక్ష్మీనారాయణ చెప్పారు.

గతాన్ని చూసినా నేషనల్ ఫ్రంట్(1989-91), యునైటెడ్ ఫ్రంట్(1996-98) ప్రభుత్వాలు బీజేపీ లేదా కాంగ్రెస్ వెలుపలి మద్దతుతోనే ఏర్పడ్డాయని ఆయన ప్రస్తావించారు.

అడ్డ గీత (లైన్)

రెండు కూటములు.. నలుగురు ప్రధానులు

బీజేపీ ఆవిర్భావం తర్వాత తొమ్మిదో లోక్‌సభ(1989) నుంచి 15వ లోక్‌సభ(2009) వరకు ఏ పార్టీకీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాలేదు. తొమ్మిదో లోక్‌సభ, 11వ లోక్‌సభల కాలంలో మాత్రమే కాంగ్రెస్ లేదా బీజేపీ భాగస్వామ్యం లేని ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పుడు కూడా బీజేపీగాని, కాంగ్రెస్‌గాని ఆయా కూటములకు వెలుపలి నుంచి మద్దతు అందించింది.

యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ హయాంలో నలుగురు నాయకులు - విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (వీపీ సింగ్), చంద్ర శేఖర్, హెచ్‌డీ దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రులుగా చేశారు.

1989 నవంబరులో నేషనల్ ఫ్రంట్ సమావేశానికి ముందు వీపీ సింగ్, ఎన్‌టీఆర్, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

1989 నవంబరులో నేషనల్ ఫ్రంట్ సమావేశానికి ముందు వీపీ సింగ్, ఎన్‌టీఆర్, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి

1989 ఎన్నికల్లో 197 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 143 సీట్లతో జనతాదళ్, 85 సీట్లతో బీజేపీ, 33 సీట్లతో సీపీఎం, 12 సీట్లతో సీపీఐ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

జనతాదళ్ నాయకుడు వీపీ సింగ్ ప్రధానమంత్రిగా 1989 డిసెంబరులో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ, వామపక్షాలు వెలుపలి నుంచి మద్దతు అందించాయి.

1980 ఏప్రిల్లో జనతా పార్టీ నుంచి వేరుపడి బీజేపీ ఏర్పాటైన తర్వాతి నుంచి, ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ లభించని తరుణంలో ఏర్పడ్డ తొలి సంకీర్ణ ప్రభుత్వం వీపీ సింగ్‌దే. వామపక్షాలు, బీజేపీ మద్దతు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా ఇదే.

నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు(ఎన్‌టీఆర్) మూలస్తంభంగా నిలిచారు.

ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో వీపీ సింగ్ 1990 నవంబరులో లోక్‌సభలో బలపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. అందులో ఓడిపోవడంతో ఆయన రాజీనామా చేశారు.

అనంతరం జనతాదళ్ నాయకుడు చంద్ర శేఖర్ ఆ పార్టీ నుంచి వేరుపడి, అదే పార్టీలోని మరికొందరు నాయకులతో కలిసి సమాజ్‌వాదీ జనతా పార్టీ(రాష్ట్రీయ) పెట్టారు. నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. చంద్ర శేఖర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు అందించింది. వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వామపక్షాలు చంద్ర శేఖర్ ప్రభుత్వానికి కూడా మద్దతు అందించాయి.

తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించింది. దీంతో చంద్ర శేఖర్ పదవికి రాజీనామా చేశారు. తొమ్మిదో లోక్‌సభ ఎన్నికలు జరిగిన దాదాపు రెండేళ్లకే మళ్లీ 1991లో ఎన్నికలు వచ్చాయి.

1991 ఎన్నికల్లో 232 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీవీ నరసింహారావు నేతృత్వంలో మైనారిటీ ప్రభుత్వం ఏర్పడింది. పీవీ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగింది.

1996 ఎన్నికల్లో 161 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది.

బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి 13 రోజుల పాలన అనంతరం పడిపోయింది. కనీస మెజారిటీకి అవసరమైనంత మద్దతు లేకపోవడంతో వాజ్‌పేయి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ తెరపైకి వచ్చింది.

లోక్‌సభలో బలపరీక్షలో ఓడిపోవడంతో దేవెగౌడ 1997 ఏప్రిల్లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

లోక్‌సభలో బలపరీక్షలో ఓడిపోవడంతో దేవెగౌడ 1997 ఏప్రిల్లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

జనతాదళ్, తెలుగుదేశం పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, అస్సాం గణ పరిషత్, ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్(తివారీ), తమిళ మానిల కాంగ్రెస్(జీకే మూపనార్), నేషనల్ కాన్ఫరెన్స్, ఇతర పార్టీలతో ఈ కూటమి ఏర్పాటైంది.

జనతాదళ్ నాయకుడు హెచ్‌డీ దేవెగౌడ ప్రధానిగా 1996 జూన్‌లో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెస్‌తోపాటు సీపీఐ మినహా ఇతర వామపక్షాలు బయటి నుంచి మద్దతు ఇచ్చాయి. సీపీఐ ప్రభుత్వంలో చేరింది.

నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరితో విభేదాలు తీవ్రమవడం, తదనంతర పరిణామాలతో దేవెగౌడ బలపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. అందులో ఓడిపోవడంతో ఆయన 1997 ఏప్రిల్లో పదవికి రాజీనామా చేశారు. దేవెగౌడ స్థానంలో ఐకే గుజ్రాల్ ప్రధాని అయ్యారు. తర్వాత కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో 1997 నవంబరులో గుజ్రాల్ రాజీనామా చేశారు.

యునైటెడ్ ఫ్రంట్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కన్వీనర్‌గా వ్యవహరించారు.

అడ్డ గీత (లైన్)

బీజేపీ, కాంగ్రెస్ ప్రమేయం లేని ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమేనని, కేసీఆర్ నమ్రతతో, ఓపిగ్గా వ్యవహరిస్తే ఇది సాకారమయ్యే అవకాశముందని విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు.

ఈ రెండు పార్టీలు బలంగా లేని పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, ఇతర జాతీయ పార్టీలు అత్యధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుని, అన్నీ కలిస్తే ఇది అసాధ్యమేమీ కాదని ఆయన చెప్పారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యలేని, బహుముఖ పోటీ ఉండే బిహార్, ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇతర పార్టీలు అత్యుత్తమ ఫలితాలు సాధించి ఏకతాటిపైకి వస్తే ఇది వీలు కావొచ్చన్నారు.

సోమవారం కోల్‌కతాలో మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సోమవారం కోల్‌కతాలో మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశమయ్యారు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్రధాన పోరు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉందని, ఈ రాష్ట్రాలో అత్యధిక సీట్లు ఈ రెండు పార్టీలకే లభించే అవకాశం ఉందని, ఈ అంశాన్ని విస్మరించలేమని లక్ష్మీనారాయణ ప్రస్తావించారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ బలాన్ని పెంచుకొనేందుకు, ప్రభుత్వ ఏర్పాటు సమయంలో బేరసారాలాడే శక్తిని ఎక్కువగా కలిగి ఉండేందుకే కాంగ్రెస్, బీజేపీ ప్రమేయంలేని ప్రభుత్వం గురించి పార్టీలు మాట్లాడుతుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా, ఏ పార్టీకీ, మరే కూటమికీ స్పష్టమైన ఆధిక్యం రాని పక్షంలో నిర్ణయాత్మక పాత్ర పోషించగలదని ప్రొఫెసర్ మూర్తి తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ కూటములకు గరిష్ఠంగా చెరి 200లోపు సీట్లు మాత్రమే వస్తే ఈ కూటమే కీలకం కాగలదన్నారు.

''అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రూపును, ప్రభుత్వ ప్రాథమ్యాలను, కార్యాచరణను నిర్ణయించడంలో ఈ కూటమి నిర్ణయాత్మక పాత్ర పోషించేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ విషయాల్లో బీజేపీ కూటమి లేదా కాంగ్రెస్ కూటమితో బేరసారాలు సాగించగల స్థాయిలో ఈ కూటమి సంఖ్యాబలం ఉండి, భాగస్వామ్య పక్షాలన్నీ ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది'' అని వివరించారు.

ఫెడరల్ ఫ్రంట్ పోషించగల పాత్రపై దిల్లీలోని సీనియర్ జర్నలిస్టు ఎ.కృష్ణారావు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

భారత పార్లమెంటు

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీ, కాంగ్రెస్‌లపై ఆధారపడకుండా ప్రభుత్వం ఏర్పాటు సాధ్యాసాధ్యాల చర్చను పక్కనబెడితే, ఫెడరల్ ఫ్రంట్ గణనీయస్థాయిలో సంఖ్యాబలాన్ని సాధిస్తే రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు ఉపయోగపడుతుందని కృష్ణారావు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం మాదిరి రాష్ట్రాల ప్రయోజనాలను విస్మరించకుండా కేంద్రాన్ని కట్టడి చేయొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

జేఎన్‌యూలోని 'సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్' అసోసియేట్ ప్రొఫెసర్ అజయ్ గూడవర్తి- ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను స్వాగతిస్తూనే, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తామనడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఫెడరల్ ఫ్రంట్ సైద్ధాంతికంగా చూస్తే మంచిదేనని, దేశంలోని వ్యవస్థల బలోపేతానికి ఇది దోహదం చేయగలదని ఆయన తెలిపారు. ''కానీ సహకార సమాఖ్య నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రస్తుతం దేశంలో వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. అలాంటి బీజేపీని వ్యతిరేకించకుండా, ఆ పార్టీపై నిర్దిష్టమైన వైఖరి ప్రకటించకుండా, 'బీజేపీ, కాంగ్రెస్‌లకు ఫెడరల్ ఫ్రంట్ సమదూరం' అనడం అర్థరహితమే కాదు, భారత సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేయాలనే ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యానికి విరుద్ధం కూడా'' అని అజయ్ బీబీసీతో చెప్పారు.

దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తృతీయ కూటమికి అవకాశాలు పరిమితమని, ఈ కూటమి ఏర్పాటు వల్ల విపక్షాల ఓట్లు చీలి పరోక్షంగా బీజేపీకే మేలు కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అడ్డ గీత (లైన్)

బీజేపీ, కాంగ్రెస్ సీట్లు కలిపి చూస్తే ఎప్పుడైనా 272కన్నా తగ్గాయా?

బీజేపీ ఆవిర్భావం తర్వాతి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు వచ్చిన సీట్లను కలిపి చూస్తే అన్నిసార్లు 272 పైనే ఉన్నాయి.

1989, 1996లలో కూడా ఈ రెండు పార్టీలకు కలిపి 272 పైనే సీట్లు వచ్చినప్పటికీ, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌ల ఆధ్వర్యంలో తృతీయ ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ అప్పుడు బీజేపీ లేదా కాంగ్రెస్ ఈ కూటములకు బయటి నుంచి మద్దతు అందించడంతోనే ఇది సాధ్యమైంది.

అడ్డ గీత (లైన్)

'భవిష్యత్తును ఫలితాలే నిర్ణయిస్తాయి'

సీనియర్ జర్నలిస్టు ఆర్వీ రామారావు బీబీసీతో మాట్లాడుతూ- నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడినప్పటి పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు మధ్య తేడాలను ప్రస్తావించారు. నాడు బలంగా ఉన్న వామపక్షాలు ఇప్పుడు బాగా బలహీనపడ్డాయని, ఇదో ముఖ్యమైన అంశమని తెలిపారు.

ఇప్పుడు బీజేపీ పట్ల అసంతృప్తి, ఆగ్రహం ఉన్న పార్టీల ఉమ్మడి లక్ష్యం బీజేపీని గద్దె దించడమేనని, అయితే బీజేపీకి వ్యతిరేకంగా రెండు పక్షాలు వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నాయని చెప్పారు.

చంద్రబాబు, కేసీఆర్

ఫొటో సోర్స్, TELANGANA CMO/FACEBOOK

''బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పేరుతో కాంగ్రెస్‌ను ఫెడరల్ ఫ్రంట్ కలుపుకొని వెళ్లడం లేదు. డీఎంకే, టీడీపీ లాంటి పార్టీలు కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్తున్నాయి. ఇదే సందర్భంలో మరో ఆసక్తికర అంశం కూడా కనిపిస్తోంది. బీజేపీని గద్దె దించాలనుకున్న ప్రస్తుత తరుణంలో చాలా పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధపడుతున్నాయి. గతంలో అత్యధిక సందర్భాల్లో కాంగ్రెస్‌ను గద్దె దించాలనుకున్నప్పుడు బీజేపీని కలుపుకొని పోవడానికి చాలా పార్టీలు మొగ్గు చూపలేదు'' అని రామారావు తెలిపారు.

ఎన్నికల ముందు ఏ పార్టీ లేదా కూటమి ఏమి చెప్పినా, ఎన్నికల ఫలితాల అనంతర పరిస్థితులు, అధికార రాజకీయాలే తదనంతర పరిణామాలను నిర్ణయిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)