మోదీ జిందాబాద్ అంటూ పాకిస్తాన్‌లో ప్రజలు ర్యాలీ తీశారా?- BBC FACT CHECK

  • ఫ్యాక్ట్ చెక్ బృందం
  • బీబీసీ న్యూస్
ర్యాలీ

ఫొటో సోర్స్, Social media

భారత ప్రధాని నరేంద్ర మోదీకి జేజేలు పలుకుతూ పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్సులో ప్రజలు ర్యాలీ తీసినట్లుగా చూపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

"ఇది భారత్ కాదు. ఇది పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్. పరాయి దేశ ప్రజలు బీజేపీకి, మోదీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి" అనే క్యాప్షన్‌‌తో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో జనాలు పాటలు పాడుతూ, మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు.

"అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తమిళనాడు" లాంటి రైట్ వింగ్ అనుకూల ఫేస్‌బుక్ గ్రూపుల్లో ఈ వీడియోను షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Social media

ఫొటో క్యాప్షన్,

రెండు రోజుల్లో కొన్ని వేలసార్లు ఈ వీడియోను షేర్ చేశారు.

తమిళం, ఇంగ్లీష్, హిందీ, తదితర భాషల్లో క్యాప్షన్లు పెట్టి ఫేస్‌బుక్, ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు.

అయితే, ఈ వీడియో బలూచిస్తాన్‌లో తీసింది కాదని మా పరిశీలనలో వెల్లడైంది.

ఫొటో సోర్స్, Twitter

వాస్తవం ఏంటి?

ఈ వీడియోతో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని, అది కశ్మీర్‌లో తీసిన వీడియో అని మా పరిశీలనలో తేలింది.

ఈ ఏడాది మార్చి 31న జమ్మూకశ్మీర్ రాష్ట్ర బీజేపీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ఈ వీడియోను ట్వీట్ చేసింది.

మరోసారి మోదీ సర్కార్ రావాలంటూ నినాదాలు చేస్తూ అనంతనాగ్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి సోఫీ యూసుఫ్‌కు మద్దతుగా వేలాది మంది ర్యాలీ తీశారని ఆ ట్వీట్‌లో రాశారు.

ఈ వీడియోను జమ్మూకశ్మీర్ బీజేపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీలోనూ షేర్ చేశారు.

బీజేపీ నేత, అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి యూసుఫ్ కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు.

ఆ వీడియోలో ఏముంది?

అది కశ్మీర్‌లోని అనంతనాగ్ పట్టణంలో ఉన్న ఖనబాల్ హౌసింగ్ కాలనీలో తీసిన వీడియో అని బీబీసీ కంట్రీబ్యూటర్ మాజిద్ జహంగీర్ తెలిపారు.

"మేము మళ్లీ గెలుస్తాం. మోదీజీ మీరు ముందుకెళ్లండి. మేము మీతోనే ఉన్నాం. అమిత్ షా జీ ముందుకెళ్లండి. మేము మీతోనే ఉన్నాం" అంటూ అనేక మంది నినాదాలు చేస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తుంది.

ఆ ర్యాలీలో బురఖా ధరించిన మహిళలు బీజేపీకి అనుకూలంగా పాటలు పాడుతూ, డ్యాన్సులు వేయడంతో పాటు, మోదీ ఫేస్ మాస్కులు ధరించడాన్ని కూడా చూడొచ్చు.

మార్చి 30న అనంతనాగ్‌లో బీజేపీ అభ్యర్థి సోఫీ యూసుఫ్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఈ వీడియోను చిత్రీకరించారు.

ఫొటో సోర్స్, Sofi Yousuf

ఫొటో క్యాప్షన్,

అనంతనాగ్ బీజేపీ అభ్యర్థి యూసుఫ్

మాజీ పోలీసు అధికారి అయిన యూసుఫ్ బీజేపీ జాతీయ మండలిలో సభ్యుడిగా ఉన్నారు. 2015లో ఎమ్మెల్యేగా గెలిచారు.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అనంతనాగ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)