అయోధ్య భూవివాదం కేసు: శనివారం ఉదయం 10.30కు తుది తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు

అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు శనివారం ఉదయం 10.30 గంటలకు తుది తీర్పు వెల్లడించనుంది.
ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్ ప్రదేశ్లో అదనపు బలగాలను కేంద్రం మోహరించింది.
అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో హిందువులు, ముస్లింల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది. 1992లో హిందువుల గుంపు మసీదును కూలగొట్టడంతో ఈ వివాదం విస్ఫోటనంగా మారింది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన మత అల్లర్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2,000 మంది చనిపోయారు.
అయోధ్య భూవివాదం కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సారథ్యం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ 2019 నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఈ కేసులో 2019 నవంబర్ 8న తీర్పు వెల్లడించనున్నారు.
అసలు వివాదం ఏంటి?
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లా అయోధ్య నగరంలో ఒక భూభాగం కేంద్ర బిందువుగా ఉన్న వివాదానికి సంబంధించిన కేసు ఇది.
హిందూ దేవుడైన రాముడి జన్మస్థలంగా హిందువులు పరిగణించే స్థలంతో పాటు.. బాబ్రీ మసీదు కూడా ఉన్న స్థలం ఇది. ప్రధానంగా ఈ స్థలాన్ని సందర్శించటానికి అనుమతి గురించిన వివాదం ఇది. అలాగే.. ఇక్కడ మసీదును నిర్మించటానికి అంతకుముందు ఉండిన హిందూ దేవాలయాన్ని కూల్చివేయటం లేదా మార్చివేయటం జరిగిందా అనే అంశం కూడా ఈ కేసులో ఇమిడి ఉంది.
బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6వ తేదీన ధ్వంసం చేశారు. ఆ ఉదంతం తర్వాత ఆ భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది.
ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు.
అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు.. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు.
ఇటువంటి సున్నితమైన అంశం మీద నిర్ణయం తీసుకోవటం ఎంత కష్టమో కోర్టు తన ఉత్తర్వులో వివరించింది. ''ఈ చిన్న భూభాగం మీద అడుగుపెట్టటానికి దేవతలు కూడా భయపడతారు. దీని నిండా లెక్కలేనన్ని మందుపాతరలున్నాయి. దానిని మేం శుభ్రం చేయాల్సి ఉంది'' అని తీర్పు వ్యాఖ్యానించింది.
అయితే, 2010 నాటి తీర్పుకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు అప్పీలు చేయటంతో ఆ తీర్పును సుప్రీంకోర్టు 2011లో సస్పెండ్ చేసింది.
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?
- బాబ్రీ విధ్వంసానికి 'రిహార్సల్స్' ఇలా జరిగాయి..
ఈ తీర్పు చెప్పబోయే న్యాయమూర్తులు ఎవరు?
అయోధ్య భూవివాదం కేసులో తీర్పు చెప్పబోయే ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యం వహిస్తారు. జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్లు ధర్మాసనంలోని ఇతర నలుగురు సభ్యులు.
ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ఒక్కరే ముస్లిం న్యాయమూర్తి.
- 'బాబ్రీ' తర్వాత పాకిస్తాన్లో కూల్చిన మందిరాలివే!
- ‘...అయితే ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరేయడం మానేస్తారా మరి?’
రామ మందిరం - బాబ్రీ మసీదు చరిత్ర ఏమిటి?
అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో హిందువులు, ముస్లింల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది.
ఆ మసీదు నిర్మించిన స్థలం.. తమ దేవుడైన రాముడి జన్మస్థలమని.. 16వ శతాబ్దంలో ఓ ముస్లిం ఆక్రమణదారు అక్కడ ఉన్న ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ మసీదును నిర్మించారని హిందువులు వాదిస్తున్నారు.
ఆ మసీదులో 1949 వరకూ తాము ప్రార్థనలు చేశామని.. అయితే ఆ ఏడాది కొంత మంది రాత్రి వేళ చీకట్లో రాముడి విగ్రహాలను తెచ్చి ఆ మసీదులో పెట్టారని ముస్లింలు అంటున్నారు. ఆ తర్వాతే ఆ విగ్రహాలను పూజించటం మొదలైందని వాదిస్తున్నారు.
ఆ తర్వాత నాలుగు దశాబ్దాల పాటు ఈ భూభాగం తమకే చెందుతుందంటూ హిందూ, ముస్లిం గ్రూపులు అక్కడ ప్రార్థనలు చేసే హక్కుల కోసం కోర్టులకు వెళ్లాయి.
అయితే, 1992లో హిందువుల గుంపు మసీదును ధ్వంసం చేయటంతో ఈ వివాదం ఉద్ధృతమైంది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన మత అల్లర్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2,000 మంది చనిపోయారు.
అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పులో త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు హిందూ న్యాయమూర్తులు.. భారతదేశంలో మొఘలు సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ నిర్మించిన ఆ భవనం నిజానికి మసీదు కాదని.. పేర్కొన్నారు. కూల్చివేసిన హిందూ దేవాలయ స్థలంలో ''ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకంగా'' దానిని నిర్మించారని వ్యాఖ్యానించారు.
ఈ ధర్మాసనంలో ముస్లిం న్యాయమూర్తి ఈ అభిప్రాయంతో విభేదించారు. అక్కడ ఏ ఆలయాన్నీ ధ్వంసం చేయలేదని.. ఆ మసీదును శిథిలాల మీద నిర్మించారని ఆయన వాదించారు.
- రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో మధ్యవర్తులు వీరే..
- రామమందిర నిర్మాణంపై విచారణ వాయిదాతో బీజేపీకి లాభమా, నష్టమా?
బాబ్రీ మసీదును ఎలా ధ్వంసం చేశారు?
1992 డిసెంబర్ ఆరో తేదీన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ)కి చెందిన హిందూ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), అనుబంధ సంస్థలకు చెందిన కొందరు నాయకులు.. 1,50,000 మంది కరసేవకుల (స్వచ్ఛంద కార్యకర్తల) తో అయోధ్యలోని ఈ వివాదాస్పద స్థలం దగ్గర ప్రదర్శన, సభ నిర్వహించినట్లు ఆరోపణ. ఆ ప్రదర్శన హింసాత్మకంగా మారింది. కరసేవకులు బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. వారిని భద్రతా బలగాలు నియంత్రించలేకపోయాయి.
ఆ సంఘటన తర్వాత దేశ వ్యాప్తంగా జరిగిన అల్లర్లలో దాదాపు 2,000 మంది చనిపోయారు.
ఇవి కూడా చదవండి.
- అయోధ్య: సుప్రీంకోర్టు తీర్పు వచ్చే ముందు ఇక్కడ మూడ్ ఎలా ఉంది? - గ్రౌండ్ రిపోర్ట్
- అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...
- అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- ఏపీ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతో తెలుగు భాషకు ప్రమాదమా
- కాలాపానీని భారత్లో చూపించినందుకు నేపాల్కు కోపం ఎందుకు?
- బెర్లిన్ వాల్ కూలిపోయి 30 ఏళ్లయ్యాక.. యూరప్ దేశాలు ఇప్పుడు అడ్డుగోడలు ఎందుకు నెలకొల్పుతున్నాయి?
- టిక్ టాక్: ఈ చైనా సోషల్-మీడియో యాప్తో దేశ భద్రత ప్రమాదంలో పడుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)