ఉత్తరప్రదేశ్ బలరామ్పూర్లో గ్యాంగ్ రేప్ ఆరోపణలు... 22 ఏళ్ల దళిత యువతి మృతి

హాథ్రస్ గ్యాంగ్రేప్ కేసు గురించి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు ఇంకా చల్లారకముందే యూపీలోనే బలరాంపూర్లో ఒక దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బలరాంపూర్ పోలీసులు ట్విటర్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని గేసడిలో ఈ ఘటన జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని చెప్పారు.
“ఫిర్యాదులో ఒక 22 ఏళ్ల యువతి కుటుంబ సభ్యులు, ఆమె ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారని చెప్పారు. మంగళవారం బాగా చీకటిపడినా ఆమె పని నుంచి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా తీయలేదు. కాసేపటి తర్వాత ఆ యువతి ఒక రిక్షాలో ఇంటికి వచ్చారు. ఆమె చేతికి గ్లూకోజ్ ఎక్కించినప్పుడు వేసే పట్టీ ఉంది. ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడికి చేరేలోపే యువతి చనిపోయారు” అని పోలీసులు ఆ వీడియోలో చెప్పారు.
“దీనిపై ఫిర్యాదు చేసిన యువతి కుటుంబ సభ్యులు ఇద్దరి పేర్లు చెప్పారు. వారిద్దరూ ఆమెను ఏ డాక్టరు దగ్గరకో తీసుకెళ్లి చికిత్స చేయించారు. యువతిపై అత్యాచారం చేశారు. ఆమె పరిస్థితి ఘోరంగా మారడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంటికి పంపించేశారని చెప్పార”ని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు పూర్తైన తర్వాత వేరే ఎవరైనా నిందితులుగా తేలితే, వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు.
ఈ ఘటనలో నిందితులు యువతి చేతులు, కాళ్లు, నడుము విరగ్గొట్టారని కూడా కొన్ని మీడియా రిపోర్టుల్లో చెబుతున్నారు.
ఒక ట్విటర్ యూజర్ కూడా “హాథ్రస్ తర్వాత యూపీలో మరో గ్యాంగ్రేప్, మర్డర్ జరిగింది. ఇది దానికంటే ఘోరంగా ఉంది. ఈసారీ యూపీలోని బలరాంపూర్లో ఒక దళిత యువతి గ్యాంగ్రేప్, మర్డర్ జరిగింది. అత్యాచారం తర్వాత ఆమె కాళ్లు, నడుము నుజ్జు చేశారు. ఆ తర్వాత ఆమెకు విషం ఇంజెక్షన్ వేశారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశామని చెబుతున్నారు” అని పోస్ట్ చేశారు.
బలరాంపూర్ పోలీసులు దీనిని ఖండించారు. ఆ యూజర్కు ట్విటర్లోనే సమాధానం ఇచ్చిన పోలీసులు “ఈ కేసులో చేతులు, కాళ్లు, నడుము విరగ్గొట్టారని చెబుతున్నది నిజం కాదు” అని చెప్పారు.
తర్వాత పోలీసులు దీనికి సంబంధించి ఒక వీడియో ప్రకటన కూడా విడుదల చేశారు.
సీఎం యోగీ రాజీనామా చేయాలంటూ డిమాండ్
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దీనిపై తన ట్విటర్లో స్పందించారు.
“బీజేపీ ప్రభుత్వం హాథ్రస్ ఘటనలా ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. తక్షణం చర్యలు తీసుకోవాలి” అని ట్వీట్ చేశారు.
మరోవైపు ఆమ్ ఆద్మీ నేత సంజయ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
“బలరాంపూర్లో గుండెలు పిండేసే ఘటన జరిగింది. ఒక దళిత యువతి కామాంధులకు బలైపోయారు. యోగీ రాజ్లో కూతురుగా ఉండడం శాపంగా మారింది. కూతుళ్లను కాపాడలేకపోతే, అధికారం వదిలేయండి యోగీ జీ” అని ట్వీట్ చేశారు.
“రాష్ట్రంలో అసలేం జరుగుతోంది. ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూచుంది. ప్రేక్షకపాత్ర పోషిస్తోంది” అని కాంగ్రెస్ ఎంపీ పునియా ట్వీట్ చేశారు.
అంతకు ముందు ఉత్తరప్రదేశ్ హాథ్రస్లో సెప్టెంబర్ 14న ఒక 20 ఏళ్ల యువతి గ్యాంగ్రేప్కు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు దిల్లీలోని సఫ్దర్గంజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.
ఇవి కూడా చదవండి:
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)