ISWOTY: రాహి సర్నోబత్.. షూటింగ్ నుంచి వైదొలగాలని భావించిన ఆమెకు అంతర్జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం వచ్చింది

రాహి సర్నోబత్

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కి చెందిన ప్రముఖ షూటర్ రాహి సర్నోబత్ అంతర్జాతీయ షూటింగ్ పోటీలలో సాధించిన విజయాలతో పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు.

జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో 25 మీటర్ల షూటింగ్‌లో ఆమె బంగారు పతకాన్ని సాధించారు. టోక్యోలో 2021లో జరగనున్న ఒలింపిక్స్‌లోనూ పాల్గొనేందుకు ఆమె అర్హత సంపాదించారు.

షూటింగ్‌లో చూపించిన ప్రతిభకు ఆమెకు అర్జున అవార్డు కూడా లభించింది.

స్కూలులో ఎన్‌సీసీ క్యాడెట్‌లో చేరినప్పుడే ఆమెకు ఆయుధాలతో పరిచయం అయింది. వీటి వాడకంలో ఆమెకు నైపుణ్యం ఉందని, తుపాకీని చూడగానే ఆమెకు సాధికారత సాధించిన భావన కలుగుతుందని ఆమె చెప్పారు.

తోటి విద్యార్థి తేజస్విని సావంత్ 2006లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో షూటింగ్‌లో బంగారు పతకం సాధించడం చూసిన తర్వాతే ఆమెకు షూటింగ్ పై ఆసక్తి పెరిగింది. తేజస్విని బంగారు పతకాన్ని సాధించడం చూసిన తర్వాత షూటింగ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిందని ఆమె చెప్పారు. ఆ తర్వాతే తను ఉంటున్న నగరంలో షూటింగ్ నేర్చుకోవడానికి ఉన్న సౌకర్యాల గురించి విచారించడం మొదలు పెట్టారని అన్నారు.

కష్టాలతో ప్రయాణం

షూటింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి కొల్హాపూర్‌లో తగినన్ని సౌకర్యాలు లేవని సర్నోబత్ గ్రహించారు. ఇక్కడున్న అరకొర సౌకర్యాల గురించి తనకున్న అసహనాన్ని ఆమె కోచ్‌తో పంచుకునేదాన్నని చెప్పారు. అయితే, సౌకర్యాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రతిభకు పదును పెట్టేందుకు వీలైనంత ఎక్కువగా కృషి చేయమని ఆయన సలహా ఇచ్చినట్లు చెప్పారు.

ఆమె తల్లి తండ్రులు ఆమెకు పూర్తి సహకారం అందించారు. ఆమెకు తొలినాళ్లలో వచ్చిన అసహనం వలన ఆమె కలలను నిజం చేసుకునే దారిలో అడ్డు రాకుండా ఉండేందుకు వారు కూడా ప్రయత్నించారు. ఆమె ఉత్తమ శిక్షణ తీసుకోవడానికి ముంబయి వెళ్లారు.

అయితే, ఆమె సమస్యలు అక్కడితో ఆగిపోలేదు. ఆమె సాధన కొనసాగించడానికి కావాల్సిన ఆయుధాలను దిగుమతి చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ఆమె ఆశక్తి కోల్పోలేదు. ఆమె పడిన కష్టానికి ప్రతిఫలంగా ఆమెకు జాతీయ స్థాయిలో జరిగే షూటింగ్ పోటీలలో నిరంతరం పతకాలు లభిస్తూ ఉండేవి.

లక్ష్యం పై గురి

దేశీయ పోటీలలో ఆమె చూపిన విశేష ప్రతిభను చూసి ఆమెను భారతదేశం తరుపున ఆడేందుకు ఎంపిక చేశారు. ఆమె 2008లో పుణెలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యూత్ కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించారు. తర్వాత ఆమె ఒలింపిక్స్, కామన్ వెల్త్, ఆసియన్ క్రీడలతోపాటు ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో కూడా భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించారు.

ఒక క్రీడాకారిణిగా సర్నోబత్ కూడా కొన్ని బలహీన దశలను చవి చూశారు. అయితే, అలాంటి పరిస్థితులను నిలదొక్కుకుని పైకి లేచారు. 2015లో ఆమెకు తగిలిన గాయం ఆమె లక్ష్యానికి ఆటంకంగా మారింది. దాంతో ఆమె ప్రతిభను ప్రదర్శించుకోవడంలో ఆమె చాలా ఒత్తిడికి లోనయ్యారు. దాంతో ఆమె షూటింగ్ నుంచి శాశ్వతంగా విరమణ తీసుకోవాలని కూడా అనుకున్నారు.

కానీ, ఆమె ఆ ఆలోచనకు స్వస్తి చెప్పి 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చారు.

ఆ మరుసటి సంవత్సరం ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లోనూ బంగారు పతకం సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడేందుకు స్థానాన్ని కూడా సంపాదించారు.

షూటింగ్‌లో సర్నోబత్ చూపిన ప్రతిభ.. ఆమెకు క్రీడల్లో గౌరవప్రదమైన అర్జున అవార్డును కూడా తెచ్చి పెట్టింది. ఈ అవార్దును సాధించడం తన జీవితంలోనే అత్యంత ఉద్వేగంతో కూడిన క్షణమని ఆమె చెబుతారు.

ఆమె భారతదేశానికి ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశపు అత్యున్నత క్రీడా అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును సంపాదించేందుకు ఆమె ఒక గట్టి పోటీదారునిగా నిలవాలని ఆశిస్తున్నారు.

(ఈ కథనంలోని అంశాలు రాహి సర్నోబత్ తో బీబీసీ ఈ-మెయిల్ ఇంటర్వ్యూ ఆధారంగా రాసినవి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)