బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?

బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?

భారతదేశంలోని అన్ని ప్రభుత్వ బ్యాంకులు సోమ, మంగళవారాల్లో సమ్మె చేస్తున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఉద్యోగుల సంఘం 'యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్' ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ ఫోరంలో భారత్‌లోని బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు చెందిన 9 సంఘాలు ఉన్నాయి.

ఐడీబీఐతోపాటూ మరో రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించబోతున్నట్లు కేంద్రం ప్రకటించడం సమ్మెకు ప్రధాన కారణంగా నిలిచింది.

బ్యాంకుల ప్రైవేటీకరణను బ్యాంక్ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులను బలోపేతం చేసి ఆర్థికవ్యవస్థను వేగవంతం చేసే బాధ్యతలు అప్పగించాల్సిన సమయంలో ప్రభుత్వం పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి.

ఈ ఏడాది రెండు ప్రభుత్వ బ్యాంకులను, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటీకరణ చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో చెప్పారు.

ఐడీబీఐ బ్యాంకును అమ్మే ప్రయత్నాలు అంతకు ముందు నుంచే నడుస్తున్నాయి. ఎల్ఐసీలో వాటాను అమ్మాలనుకుంటున్నట్లు గత ఏడాది బడ్జెట్లోనే చెప్పారు.

కానీ, ఇప్పటివరకూ ఏయే బ్యాంకుల్లో తమ వాటాను పూర్తిగా లేదా కొంత బాగాన్ని అమ్మాలనుకుంటోందో ప్రభుత్వం ఇంకా చెప్పలేదు.

అయితే.. నాలుగు బ్యాంకులను అమ్మడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, వాటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

వీటిని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, ఈ నాలుగు బ్యాంకుల్లో పనిచేసే దాదాపు లక్షా 30 వేల మంది సిబ్బందితోపాటూ మిగతా ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా ఈ చర్చతో కలకలం రేగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)