వారణాసి - కాశీ విశ్వనాథ్ కారిడార్: ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కారిడార్ ప్రత్యేకతలేంటి
- విక్రాంత్ దుబే
- వారణాసి నుంచి, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Twitter@BJP
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన కలల ప్రాజెక్టు శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ను సోమవారం వారణాసిలో ప్రారంభించారు.
వారణాసికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మొదట కాల భైరవ ఆలయంలో హారతి ఇచ్చారు. తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్లడానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్తో కలిసి ఖిర్కియా ఘాట్ నుంచి లలితా ఘాట్ వరకూ డబుల్ డెకర్ బోటులో ప్రయాణించారు.
గంగా నదీ తీరాన ఘాట్ల దగ్గర ఉన్న జనాలకు చేతులు ఊపుతూ ముందుకు సాగారు. లలితా ఘాట్ చేరుకున్న తర్వాత ప్రధాని కాశీ విశ్వనాథుడికి పూజలు చేశారు. తర్వాత ఆయన కాశీ విశ్వనాథ్ ప్రాజెక్టును ప్రారంభించారు.
యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద వేడుకలా నిర్వహించడానికి నగరాన్ని అందంగా అలంకరించింది.
కాశీ విశ్వనాథ్ ధామ్ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
32 నెలల్లో పూర్తయిన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్
1669లో అహిల్యాబాయి హోల్కర్ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత దాదాపు 350 ఏళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ విస్తరణ, పునరుద్ధరణ కోసం 2019 మార్చి 8న విశ్వనాథ్ ఆలయ కారిడార్కు శంకుస్థాపన చేశారు.
అది జరిగిన దాదాపు రెండేళ్ల 8 నెలలకు ఇప్పుడు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్లో 95 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం కారిడార్ నిర్మాణానికి రూ.340 కోట్లు వ్యయం చేశారని భావిస్తున్నారు. అయితే దీని మొత్తం వ్యయం గురించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు.
మొత్తం కారిడార్ను దాదాపు 50 వేల చదరపు మీటర్ల ఒక పెద్ద ప్రాంగణంగా నిర్మించారు. దీని ప్రధాన ప్రవేశ మార్గం గంగానది వైపు లలితా ఘాట్ నుంచి ఉంటుంది.
విశ్వనాథ్ కారిడార్ను మొత్తం 3 భాగాలుగా విభజించారు. మొదటిది ఆలయ ప్రధాన భాగం. దీనిని రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించారు. ఇందులో నాలుగు పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి. ఇందులో ఒక ప్రదక్షిణ మార్గం కూడా నిర్మించారు. ఆ ప్రదక్షిణ మార్గంలో 22 మార్బుల్స్ మీద కాశీ మహిమను వర్ణించే వివరాలు చెక్కారు.
ఈ కారిడార్లో 24 భవనాలు కూడా నిర్మించారు. వీటిలో ప్రధాన ఆలయ ప్రాంగణం, ఆలయ చౌరస్తా, ముముక్షు భవన్, యాత్రికుల వసతి కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ హాల్, సిటీ మ్యూజియం, వారణాసి గ్యాలరీ, గంగా వ్యూ కెఫే రెస్టారెంట్ ఉన్నాయి.
ఈ ధామ్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ప్రాంగణం చుట్టూ 5 వేలకు పైగా లైట్లు ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ లైట్లు పగటి పూట, మధ్యాహ్నం, రాత్రి రంగులు మారుతూ ఉంటాయి.
"కారిడార్లో ఏయే సౌకర్యాలు అవసరమో వాటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నాం. అంటే మ్యూజియం, వారణాసి గ్యాలరీ, ముముక్షు భవన్, రెస్టారెంట్ లాంటివి నిర్మించాం. ఆధ్యాత్మిక గ్రంథాలు చూడాలనుకుంటే అవి వైదిక కేంద్రంలో కూడా ఉంటాయి" అని ధామ్ను నిర్మించిన పీఎస్పీ కంపెనీ సీఎండీ పీఎం పటేల్ చెప్పారు.
ఫొటో సోర్స్, VIKRANT DUBEY
కాశీలో పండుగ వాతావరణం
కాశీ అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ భవనాలు, చౌరస్తాలు రంగురంగుల విద్యుత్ లైట్లతో వెలిగిపోతున్నాయి. నగరంలో ప్రజలు కూడా తమ ఇళ్లు, షాపులను అందంగా అలంకరించారు.
అక్కడక్కడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 13న సాయంత్రం దీపావళిలా ప్రజలందరూ తమ ఇళ్లను దీపాలతో అలంకరించాలని కోరారు.
విశ్వనాథ్ కారిడార్ వరకూ వెళ్లే దారి పొడవునా అన్ని భవనాలకూ అధికారులు కాషాయ రంగు వేశారు. అయితే ఆ దారిలో ఉన్న ఒక మసీదుకు కూడా ఆ రంగు వేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
దీనిపై ముస్లిం సమాజం శాంతిపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు దానికి మళ్లీ తెల్ల రంగు వేశారు. దీనిని సానుకూలంగా తీసుకున్న ముస్లింలు అధికారులను ప్రశంసించారు.
ఫొటో సోర్స్, VIKRANT DUBEY
ప్రభుత్వ సన్నాహాలే కాదు, నగరంలోని సామాన్యులు కూడా దీనిని ఒక వేడుకలా భావిస్తున్నారు.
"వేడుక అనేది మన సంస్కృతిలో కీలకమైన భాగం. కాశీ విశ్వనాథ్ కారిడార్ అనేది మొత్తం కాశీకే ఒక ప్రతిష్టాత్మకమైన విషయం. మా కాశీ దేవతల దీపావళి కూడా చేస్తుంది. ఈ సారి మేం శివ దీపావళిని జరుపుకుంటున్నాం" అని రెస్టారెంట్, సినీ పరిశ్రమలో ఉన్న ఆలోక్ దుబె అన్నారు.
"రెండేళ్ల క్రితం ఇక్కడికి వచ్చా, కానీ, ఈసారి ఇక్కడ వాతావరణం ఊహించని విధంగా ఉంది. విశ్వనాథ్ ధామ్ గురించి బ్లాగ్, వీడియోలు చూశాను. కానీ ఇక్కడికి వచ్చాక అది దానికంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నట్టు కనిపించింది. ఇంతకు ముందు ఆలయ శిఖర దర్శనం చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ అన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి" అని పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్ నుంచి కాశీని చూడ్డానికి వచ్చిన మహేంద్ర గుప్తా చెప్పారు.
"శివభక్తురాలు అహిల్యాబాయి హోల్కర్ 350 ఏళ్ల క్రితం ప్రస్తుత శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని నిర్మించారు. 2 వేల చదరపు మీటర్లలో వ్యాపించిన ఆలయానికి ప్రజలు ఇరుకైన వీధుల్లో వచ్చేవారు. ఆలయంలో చాలా తక్కువ చోటుండేది. ఇక్కడికి బలహీనులు, రోగులు, వృద్ధులు చేరుకోవడం గతంలో కష్టమయ్యేది" అని విశ్వనాథ్ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా అర్చకులుగా పనిచేస్తున్న శ్రీకాంత్ మిశ్రా బీబీసీకి చెప్పారు.
ఫొటో సోర్స్, VIKRANT DUBEY
16 లక్షల లడ్డూలు
విశ్వనాథ్ ఘాట్ జాతికి అంకితమయ్యే ఈ కార్యక్రమానికి దేశంలో 3 వేల మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.. వీరిలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
వారణాసిలో ఈ వేడుకలు ఒక నెలపాటు నిర్వహించనున్నారు. దీనికి 'భవ్య కాశీ, దివ్య కాశీ' అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో వారణాసిలో నివసించే ప్రతి వ్యక్తికీ అందేలా 16 లక్షల లడ్డూల ప్రసాదం పంచుతున్నారు. ఈ లడ్డూలను కార్యకర్తలు నేరుగా ప్రజల ఇళ్లకే చేరుస్తారు. ప్రసాదంతోపాటూ ప్రజలకు ఒక స్మారకం కూడా ఇస్తారు.
కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం కోసం దాదాపు 400 ఇళ్లు, వందలాది ఆలయాలు సేకరించారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో విశ్వనాథ్ ఆలయం ఉండడంతో దాదాపు 400 ఆస్తులు కొనుగోలు చేశారు. దాదాపు 14 వందల మందిని నగరంలో ఇతర ప్రాంతాలకు తరలించారు.
దాదాపు రెండేళ్ల 8 నెలలపాటు నిర్మాణం జరిగిన ఈ డ్రీమ్ ప్రాజెక్టులో ఇప్పటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ కారిడార్లో 2600 మంది కార్మికులు, 300 మంది ఇంజనీర్లు మూడు షిఫ్టుల్లో నిరంతరం పనిచేస్తున్నారు.
ఈ కారిడార్ నిర్మాణం కోసం సేకరించిన 400 ఆస్తుల్లో 27 కాశీ ఖండోక్త్ ఆలయాలు, 127 ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా సంరక్షించనున్నారు.
కాశీ ఖండోక్త్ ఆలయాన్ని గతంలో ఉన్నట్లు పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు. దీనిని కారిడార్లోని రెండో దశలో పూర్తి చేయనున్నారు.
ఇవి కూడా చదవండి:
- రైతుల ఉద్యమం వాయిదాపడింది.. కానీ మోదీ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- మనుషులు నడవడం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు నడిచారు?
- ‘నీ సెక్స్ జీవితం ఎలా ఉంది అని అడిగారు, రేప్ చేసి చంపేస్తామనీ బెదిరించారు’
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ కేసు.. విశాఖపట్నంలో ఐసోలేషన్లో 30 మంది
- ఒక బాలిక యదార్థ గాధ: "నా చేతులు పట్టుకుని అసభ్యంగా... నేను వారికి అభ్యంతరం చెప్పలేక.."
- ‘రాత్రి 12 గంటలకు ‘బతికే ఉన్నావా’ అని మెసేజ్ పెట్టాను.. జవాబు రాలేదని ఫోన్ చేస్తే ఆయన స్నేహితులు ఎత్తారు’
- ‘నేను భారతీయ పైలట్నని తెలిసిన తరువాత కూడా ఆ పాకిస్తాన్ గ్రామస్థులు చికెన్తో భోజనం పెట్టారు’
- ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)