నిజాం నవాబ్ కాదు, బిల్ గేట్సూ కాదు, చరిత్రలో అత్యంత ధనికుడు ఇతడే...

మొదటి మన్సా మూసా
ఫొటో క్యాప్షన్,

మొదటి మన్సా మూసా సంపదను ఖచ్చితంగా అంచనా వేయడం అసాధ్యం

'మనీ' పత్రికలో కొన్ని కథనాలు 'చరిత్రలో అత్యంత ధనికుడు' లాంటి పదాలతో ప్రారంభం అవుతాయి. మొదటి మన్సా మూసా సుల్తాన్ (1280-1337) గురించి కూడా ఇలాగే చెప్పొచ్చు.

మూసా మాలి సామ్రాజ్యాన్ని పాలించారు. అనేక బంగారు గనులు ఆయన ఆధీనంలో ఉండేవి.

బంగారానికి ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉన్న కాలమది. ఆయన నిజమైన పేరు మొదటి మూసా కీటా. కానీ సింహాసనంపై కూర్చోవడంతో ఆయన పేరు మన్సాగా మారింది. మన్సా అన్న పదానికి రాజు అని అర్థం.

మన్సా మూసా సామ్రాజ్యం ఎంత పెద్దదంటే, దాని సరిహద్దులు అంతుచిక్కేవి కావు. నేటి మారిటానియా, సెనెగల్, జాంబియా, గినియా, బుర్కినా ఫాసో, మాలి, నైగర్, చాద్, నైజీరియాలు నాడు మూసా సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి.

మన్సా మూసా నిర్మించిన మసీదుల్లో ఇంకా అనేకం ఇప్పటికీ ఉన్నాయి.

జింగారెబర్ మసీదు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

టింబక్టులోని జింగారెబర్ మసీదు మన్సా మూసా నిర్మించిన అనేక మసీదుల్లో ఒకటి

మూసా సంపద ఎంత?

మూసా సంపదను నేటి లెక్కల్లో అంచనా వేయాడం కష్టం. ఒక అంచనా ప్రకారం అది భారత కరెన్సీలో సుమారు 25 లక్షల కోట్లు.

ఇటీవల అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ప్రకటించారు. ఆయన సంపద సుమారు 6.7 లక్షల కోట్లు. అంటే మన్సా మూసా సంపద జెఫ్ బెజోస్ సంపదకన్నా ఎక్కువ.

సంకోరే విశ్వవిద్యాలయం
ఫొటో క్యాప్షన్,

మన్సా మూసా ఆదేశాల ప్రకారం నిర్మించిన సంకోరే విశ్వవిద్యాలయం. మాలిలో నిర్మించిన అతి పురాతన విద్యాసంస్థలలో ఇది ఒకటి.

మన్సా మూసా మక్కా యాత్ర గురించిన కథనం ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. అది 1324లో జరిగింది. ఆ యాత్ర సుమారు 6 వేల కిలోమీటర్లు సాగింది.

ఆయన వెళ్లే దారిలో ఆయనను దర్శించుకోవాలనుకున్న ప్రజలు, ఆయన వెంట ఉన్న పరివారాన్ని చూసి నోరు వెళ్లబెట్టేవారు.

మన్సా మూసా బిడారులో సుమారు 60 వేల మంది ఉండేవారు. వారిలో 12 వేల మంది కేవలం మూసా సుల్తాన్ వ్యక్తిగత సహాయకులు.

మన్సా మూసాకు ముందు 500 మంది గుర్రాలపై స్వారీ చేస్తుండేవారు. వాళ్ల చేతుల్లో బంగారు కర్రలుండేవి. ఈ 500 మంది అత్యంత ఖరీదైన పట్టువస్త్రాలు ధరించేవారు.

దాంతో పాటు ఆయన బిడారులో 80 ఒంటెల బృందం ఉండేది. దాని మీద 136 కిలోల బంగారం ఉండేది.

మూసా ఎంత ఉదారుడంటే, ఆయన బిడారు ఈజిప్టు రాజధాని కైరో గుండా ప్రయాణించేటప్పుడు, అక్కడున్న పేదలకు ఆయన చేసిన దానాలతో ఆ ప్రాంతంలో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి అంటారు.

కేటలాన్ అట్లాస్‌
ఫొటో క్యాప్షన్,

కేటలాన్ అట్లాస్‌లో మూసా సామ్రాజ్యం

మన్సా మూసా మక్కా యాత్రతో ఆయన సంపద గురించిన వార్తలు యూరప్ ప్రజల చెవినబడ్డాయి. ఇది నిజమేనా అని తెలుసుకోవడానికి అనేక మంది యూరోపియన్లు ఆయనను సందర్శించేందుకు వచ్చేవారు.

ఆయన సంపద నిజమేనని నిర్ధారించుకున్న అనంతరం మాలి సామ్రాజ్యాన్ని ఆ రోజుల్లో ప్రముఖంగా ఉన్న కేటలాన్ అట్లాస్‌లో చేర్చారు. 14వ శతాబ్దపు కేటలాన్ అట్లాస్‌లో యూరోపియన్లు తమకు తెలిసిన అన్ని ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించేవారు.

యూరోపియన్ చిత్రాలలో మొదటి మన్సా మూసా
ఫొటో క్యాప్షన్,

యూరోపియన్ చిత్రాలలో మొదటి మన్సా మూసా

25 ఏళ్ల పాటు పాలించిన అనంతరం మూసా 1337లో మరణించారు.

మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రుడాల్ప్ వైర్ ‘మనీ’ పత్రికతో మాట్లాడుతూ.. ''ఇది చరిత్రలో అత్యంత ధనికుడైన వ్యక్తికి సంబంధించిన విషయం. మీకు ఎంత సంపద ఉందో అంచనా వేయటం కూడా అసాధ్యమే అవుతుందో, అప్పుడు మీరు అత్యంత ధనికుడి కింద లెక్క'' అంటారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)