సియెర్రా లియోన్: రూ.42 కోట్ల విలువైన వజ్రం దొరికినా కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామం

సియెర్రా లియోన్‌లోని ఒక చిన్న గ్రామం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇక్కడ ఉన్న ఒకే ఒక్క పాఠశాలలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేరు. చాలా మంది గ్రామస్తులకు రెండు పూటల అన్నం దొరకడం కూడా భాగ్యమే

కొయార్దు.. సియెర్రా లియోన్‌లోని ఒక చిన్న గ్రామం. ప్రపంచంలోనే అతి పెద్ద ముడి వజ్రం ఇక్కడ దొరకడంతో 2017లో ఆ ఊరి పేరు మారుమోగింది. 709 కేరట్ల ఆ వజ్రం దాదాపు 42 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. కనీస సౌకర్యాలు కూడా లేని ఆ గ్రామ అభివృద్ధి కోసం కొంత ఖర్చు చేస్తామని ఆనాడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏడాది గడుస్తోంది.. మరి ఆ ఊరి పరిస్థితిలో మార్పు ఏమైనా వచ్చిందా?

తూర్పు సియెర్రా లియోన్‌లో కొయార్దా గ్రామం ఉంది. అడవి మధ్య ఉండే ఈ గ్రామంలో కనీసం సౌకర్యాలు కూడా లేవు.

అతి పెద్ద ముడి వజ్రం దొరకడంతో ఈ ఊరు గత ఏడాది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఒక క్రైస్తవ మతబోధకుడు, అతని తవ్వకందార్ల బృందం ఆ వజ్రాన్ని కనుగొన్నారు. సాధ్యమైనంత ఎక్కువ ధరకు అమ్మాలనే ఉద్దేశంతో వారు దాన్ని ఆ దేశ అధ్యక్షుడికి ఇచ్చేశారు.

న్యూయార్క్‌లో జరిగిన వేలంలో ఆ వజ్రాన్ని ప్రభుత్వం సుమారు 42 కోట్ల రూపాయలకు అమ్మింది. దాన్ని కనుగొన్న మతబోధకునికి రూ. 13 కోట్లు దక్కాయి. మిగతా మొత్తంలో కొంత గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

వీడియో క్యాప్షన్,

వీడియో: గ్రామంలో రూ.42 కోట్ల విలువైన వజ్రం దొరికినా అభివృద్ధి మాత్రం జరగలేదు

‘‘వచ్చిన డబ్బుల్లో సింహభాగాన్ని ప్రభుత్వమే తీసుకుంది. ఆ వజ్రం దొరికిన ఈ గ్రామ అభివృద్ధి కోసం సుమారు రూ.7 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పింది. తద్వారా ఇక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొంది’’ అని మతబోధకుడు ఇమాన్యుల్ మోమోహ్ చెప్పారు.

అయితే వాస్తవం వేరేలా ఉంది. అభివృద్ధి ఆనవాళ్లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

‘‘ప్రభుత్వం మా గ్రామానికి ఇప్పటికీ ఏమీ చేయలేదు. అభివృద్ధి చేస్తానని ప్రభుత్వం మాట ఇచ్చింది. ఆ దిశగా ఇంకా అడుగులు పడలేదు. పాఠశాల, ఆసుపత్రి నిర్మించడంతోపాటు తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది. మాకు నేరుగా డబ్బులు ఇస్తారని అనుకున్నాం. కానీ అది మా కష్టార్జితం కాదని, దొరికిన ఆస్తి అని అధికారులన్నారు’’ అని చెప్పారు ఊరి పెద్ద సహర్ లెబ్బీ.

ఇక్కడ ఉన్న ఒకే ఒక్క పాఠశాలలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేరు. చాలా మంది గ్రామస్తులకు రెండు పూటల అన్నం దొరకడం కూడా భాగ్యమే.

అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టులు ఇచ్చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ప్రభుత్వం బీబీసీతో చెప్పింది.

ఆ వజ్రం దొరికి ఏడాది దాటింది. అది తమ గ్రామ రూపురేఖలు మారుస్తుందన్న ఆశ మాత్రం ప్రజల్లో ఇప్పటికీ సజీవంగానే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)