చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- థామ్ పూలే
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
'కెప్టెన్ అమెరికా' మార్వెల్ అవెంజర్స్లో ఒక సూపర్ హీరో పాత్ర . కానీ, చైనా ఇప్పుడు తన సొంత అసలు సిసలు కెప్టెన్ అమెరికా వెర్షన్ తయారు చేయబోతోందా? అమెరికా నిఘా వర్గాలు అదే చెబుతున్నాయి.
కానీ ఈ హైప్ను పక్కనపెడితే, సూపర్ సోల్జర్ను తయారుచేయడం అంత అసాద్యమేమీ కాదు. దానిపై ఒక్క చైనా మాత్రమే ఆసక్తి చూపించడం లేదు.
దీన్నే లోతుగా గమనిస్తే, మిగతా దేశాలపై పైచేయి సాధించాలనే కోరికతో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల సైన్యం అత్యాధునిక ఆయుధాల నుంచి మామూలుగా ఉపయోగించేవాటి వరకూ ఎన్నో సాంకేతిక ఆవిష్కరణలు చేశాయి.
మనం 'డక్ట్ టేప్' విషయానికే వస్తే.. ఇలినాయిస్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక మహిళ ఇచ్చిన సలహాతో దానిని తయారు చేశారు.
ఆమె పేరు వెస్టా స్డౌట్. ఆమె కొడుకులు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నావికా దళంలో పనిసేవాళ్లు.
యుద్ధంలో పోరాడే సైనికులు తమ మందుగుండు పెట్టెలను మూసి ఉంచడానికి ఒక పలచటి కాగితం టేప్ అతికించడం గురించి వెస్టా ఆందోళన చెందేవారు. దానికి బదులు వాటర్ ప్రూఫ్ గుడ్డతో తయారుచేసే టేప్ బలంగా ఉంటుందని చెప్పారు. కానీ, ఆమెకు తన సూపర్వైజర్ల నుంచి ఎలాంటి మద్దతు అందలేదు. దాంతో, ఆమె అధ్యక్షుడు రూజ్వెల్డ్కు తన టేప్ గురించి లేఖ రాశారు. ఆయన ఆమె ఆలోచనను వాస్తవరూపంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
సైన్యంలో అవవసరాలు ఒక బలంగా అతికించే టేప్ తయారీకి కారణమైనప్పుడు, అవి ఇంకా ఏమేం చేయగలవు.
ఫొటో సోర్స్, USSOCOM
అమెరికా టాలోస్ ప్రాజెక్ట్
ఐరన్ మ్యాన్ను తయారుచేస్తున్నాం-ఒబామా
2014లో తన కొత్త లక్ష్యాల గురించి జర్నలిస్టులకు చెప్పిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా "మేం ఐరన్ మాన్ను తయారుచేస్తున్నామని ప్రకటించడానికే నేనిక్కడికి వచ్చాను" అన్నారు.
అక్కడ అందరూ నవ్వారు. కానీ ఆయన దానిని సీరియస్గానే చెప్పారు. అమెరికా ఆర్మీ అప్పటికే 'టాక్టికల్ అసాల్ట్ లైటర్ ఆపరేటర్ సూట్'(TALOS) అనే ఒక రక్షణ సూట్ ప్రాజెక్ట్ మీద పని ప్రారంభించింది. ఒక వీడియో గేమ్లా ఉన్న దాని ప్రమోషనల్ వీడియోలో అది వేసుకున్న ఒక వ్యక్తి శత్రువులతో పోరాడుతుంటే. బుల్లెట్లు అతడి కవచానికి తగిలి కింద పడుతుంటాయి.
ఐరన్ మ్యాన్ రాలేకపోయాడు. ఐదేళ్ల తర్వాత ఆ ప్రయత్నం ముగిసింది. కానీ ఆ సూట్లో వివిధ భాగాలను వేరే ఎక్కడైనా ఉపయోగించవచ్చని దాన్ని తయారు చేసినవారు ఆశించారు.
సైనికుల శక్తి సామర్థ్యాలను మరింత పెంచాలని చూసే మిలటరీలకు ఆశాజనకంగా కనిపిస్తున్న మరో సాంకేతికత 'ఎక్సో స్కెలిటన్స్'.
సైనికుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం కొత్త విషయమేం కాదు. పురాతన కాలం నుంచీ ఆయుధాలు, సైనికుల కిట్లు, శిక్షణలో పురోగతి సాధిస్తూ భద్రతా దళాలను బలోపేతం చేస్తూ వస్తున్నారు.
కానీ, ఈరోజు సామర్థ్యం మెరుగుపరచడం అంటే ఒక సైనికుడికి మంచి తుపాకీ అందిస్తే సరిపోదు. అది ఒక సైనికుడిని మార్చినట్టే అవుతుంది.
2017లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ "మానవాళి త్వరలో అణు బాంబు కంటే భయంకరమైనది సృష్టించవచ్చు" అని హెచ్చరించారు.
"సిద్ధాంతపరంగానే కాకుండా, ప్రాక్టికల్గా కూడా మనిషి కొన్ని లక్షణాలతో ఉన్న ఒక మనిషిని సృష్టించగలడని మనం ఊహించవచ్చు. తను ఒక గణిత మేధావి కావచ్చు, తెలివైన సంగీత విద్వాంసుడో, సైనికుడో కావచ్చు. భయం, దయ, బాధ, నొప్పి అనేదే లేకుండా పోరాడవచ్చు" అని గత ఏడాది అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్(డీఎన్ఐ) మాజీ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ అన్నారు. చైనాపై నిరాధార ఆరోపణలు కూడా చేశారు.
"జీవపరంగా మెరుగైన సామర్థ్యాలతో సైనికులను తయారు చేయడానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సభ్యులపై చైనా పరీక్షలు నిర్వహిస్తోంది. అధికారం కోసం ఆరాటపడే చైనాకు నైతిక హద్దులే లేకుండాపోయాయి" అని ఆయన వాల్స్ట్రీట్ జర్నల్లో రాశారు.
చైనా ఆ ఆర్టికల్లో ఉన్నదంతా అబద్ధం అని కొట్టిపారేసింది.
ఆయన వ్యాఖ్యల గురించి కొత్త డీఎన్ఐ ఎవ్రిల్ హెయిన్స్ను అడిగినపుడు ఆమె దాని గురించి వ్యాఖ్యానించరని ఆమె కార్యాలయం చెప్పింది.
మరోవైపు బైడెన్ పాలనలో డోనల్డ్ ట్రంప్ ఎజెండాను చాలావరకూ తొలగించినప్పటికీ, చైనాతో ఉద్రిక్తతలు అమెరికా విదేశాంగ విధానాల్లో ఒకటిగా మిగిలిపోనుంది.
ఫొటో సోర్స్, PA Media
ఆశయాలు, వాస్తవాలు
ర్యాంకుల్లో ఒక సూపర్ సైనికుడు ఉండడం అనేది సైన్యంలో ఆశలు కలిగించే ఒక అవకాశం. నొప్పులను, అత్యంత చలిని భరించగలిగేలా, నిద్ర అవసరమే లేని ఒక సైనికుడి గురించి ఊహించుకోండి.
కానీ, అమెరికా ఐరన్ మ్యాన్ను తయారుచేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో 'సాంకేతిక సంయమనం' అనేది ఆ ఆశయం వాస్తవంగా మారకుండా అడ్డుకోగలదు.
చైనా సైన్యం జన్యు సవరణలు, ఎక్సోస్కెలిటన్స్, హ్యూమన్-మెషిన్ కొలాబరేషన్ లాంటి పద్ధతుల గురించి చైనా చురుకుగా అన్వేషిస్తోందని 2019లో ఇద్దరు విద్యావేత్తలు చెప్పారు.
కానీ, రాట్క్లిఫ్ వ్యాఖ్యలపై రచయితల్లో ఒకరైన సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ సీనియర్ ఫెలో ఎల్సా కనియా అనుమానాలు వ్యక్తం చేశారు.
"చైనా సైన్యం దేన్ని నిజం చేయాలని ఆశిస్తోందో, చర్చిస్తోందో తెలుసుకోవడం ముఖ్యం. కానీ, అదే సమయంలో ఆ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఎక్కడుంది అని వారి ఆశయానికి, వాస్తవానికి మధ్య దూరం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది" అని కనియా అన్నారు.
"సూపర్ సోల్జర్స్ రూపొందించడం సాధ్యమేనా అనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా మిలిటరీకి ఉన్నప్పటికీ. ఏదో ఒక రోజు సైన్స్ పరిధిలో సాధించబోయేది, సరిహద్దుల దగ్గర ఎలాంటి చర్యలనైనా అడ్డుకోగలుగుతుంది. మనుషులపై ప్రయోగాలు జరిగాయని రాట్క్లిఫ్ చెప్పారు. జన్యు సవరణలతో కొందరు పెద్దవారిలో లక్షణాలు మార్చగలిగినా, పిండాల డీఎన్ఏను మార్చడం అనేది సూపర్ సోల్జర్ రూపొందించే అత్యంత ఆమోదయోగ్యమైన మార్గాల్లో ఒకటి కావచ్చు".
సూపర్ సోల్జర్ సాధ్యమేనా?
"ఇది సాధ్యమా అనేదానికంటే, శాస్త్రవేత్తలు ఆ టెక్నాలజీని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్న ఎక్కువగా వస్తుంది" అని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరమాణు జన్యు శాస్త్రవేత్త డాక్టర్ హెలెన్ ఓనెల్ అన్నారు.
జన్యు సవరణ, సహాయక పునరుత్పత్తి అనే సాంకేతిక పద్ధతులను సాధారణంగా జంతువుల్లో సంకర జాతుల సృష్టికి, వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. మనిషిని ఉపయోగించడానికి ఆ రెండింటినీ కలపడాన్ని ప్రస్తుతం అనైతికంగా భావిస్తున్నారు.
"హెచ్ఐవీ రాకుండా కవల బాలికల పిండాల్లో డీఎన్ఏను సవరించడంలో విజయవంతం అయినట్లు" 2018లో చైనా శాస్త్రవేత్త హీ జియాన్కుయ్ ఒక సంచలన ప్రకటన చేశారు.
ఆయన ఈ ప్రకటన చాలామందికి ఆగ్రహం తెప్పించింది. ఇలాంటి జన్యు సవరణలను చైనా సహా చాలా దేశాల్లో నిషేధించారు. దీనిని సాధారణంగా ఐవీఎఫ్ పిండాల వరకే పరిమితం చేశారు. తర్వాత అవి వెంటనే నాశనం అవుతాయి. ఇలాంటి సవరణలను పిల్లలను తయారు చేయడానికి ఉపయోగించరు.
కానీ, ఆ శాస్త్రవేత్త తన పరిశోధనను సమర్థించుకున్నారు. కానీ, ప్రభుత్వ నిషేధాన్ని ఉల్లంఘించినందుకు చివరకు ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
దీనిపై మాట్లాడిన చాలా మంది "హీ జియాన్కుయ్ కేసు బయోఎథిక్స్లో చాలా కీలకమైనది. అది కవలలను హెచ్ఐవీ నుంచి కాపాడింది, ఈ చికిత్స మేధోవికాసం కూడా తీసుకొచ్చింది" అని అన్నారు.
ఈ కవలల సృష్టికి హీ జియాన్కుయ్ 'క్రిస్ప్ టెక్నాలజీ'(Crispr technology) ఉపయోగించారు. సజీవ కణాలున్న డీఎన్ఏకు నిర్దిష్టమైన, కచ్చితమైన మార్పులు చేయడానికి అది ఒక మార్గం. దీని ద్వారా కొన్ని లక్షణాలను తొలగించి, వేరే వాటిని జోడిస్తారు.
ఇది చాలా ఆశాజనకంగా ఉంటుంది. వారసత్వంగా వచ్చే వ్యాధులకు కూడా దీని ద్వారా చికిత్స చేయవచ్చు.
ఫొటో సోర్స్, FONDS DE DOTATION CLINATEC
పక్షవాతం వచ్చినవారికి నడవడానికి సాయం చేసే 'ఎక్సోస్కెలిటిన్'
సైన్యంలో ఈ పద్ధతితో ఏం చేయచ్చు
క్రిస్ప్ టెక్నాలజీ విప్లవాత్మకమైనదని లండన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్త క్రిస్టొఫీ గలిచెట్ వర్ణించారు
దీనికి పరిమితులు ఉంటాయన్న ఆయన, మనం కంప్యూటర్లో ఒక పేజీలోని పదాలు వెతకడానికి ఉపయోగించే 'ఫైండ్' అండ్ రీప్లేస్'తో పోల్చారు.
మనం దాని ద్వారా ఒక పదాన్ని సులభంగా వేరే పదంతో మార్చేయవచ్చు. కానీ ఒక దగ్గర సరిగా ఉండే ఆ పదాలు, ఇంకో దగ్గర అర్థవంతంగా ఉండకపోవచ్చు అన్నారు.
"ఒక జన్యువుకు ఒకే ప్రభావం ఉంటుందనుకోవడం తప్పు. మనం ఒక జన్యువును తీసుకుంటే, అది మనకు కండరాలు బలంగా ఉండేలా, లేదా అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఉపిరి తీసుకోగలిగేలా చేయగలదు. కానీ, ఆ ఎత్తు కంటే కిందికి వచ్చినపుడు, అది మనకు క్యాన్సర్ రావడానికి కారణం కావచ్చు"
కొన్ని లక్షణాలను వేరు చేయడం కూడా కష్టమే. ఉదాహరణకు.. చాలా జన్యువులకు ఎత్తుతో సంబంధం ఉంటుంది. అలాంటి వాటి లక్షణాలు మారిస్తే, తర్వాత తరాలవారికి కూడా అవే సంక్రమిస్తాయి.
చైనా ప్రయత్నాలను అమెరికాకు ప్రత్యక్ష స్పందనగా కొంతమంది విశ్లేషకులు చూస్తున్నారు.
గార్డియన్లో 2017లో వచ్చిన ఒక కథనంలో మలేరియా దోమలు, ఎలుకలు, ఇతర జాతులను తుడిచిపెట్టేసేలా వాటి జన్యువులను నాశనం చేసే టెక్నాలజీ కోసం అమెరికా మిలిటరీ ఏజెన్సీ వంద మిలియన్ల పెట్టుబడి పెడుతోందని కథనం ప్రచురించింది. దానిని సైన్యంలో ఉపయోగించవచ్చని చాలా దేశాలు భయపడుతున్నాయని ఐక్యరాజ్యసమితి నిపుణులు హెచ్చరించారు.
సైనికపరంగా పైచేయి సాధించాలని చూస్తున్న దేశాల్లో చైనా, అమెరికా మాత్రమే లేవు. సైనికులను మరింత సమర్థులుగా చేసే పరిశోధనలకు ఫ్రాన్స్ భద్రతాదళాలు అనుమతి పొందాయి. వీటికి నైతిక పరిమితులు పాటిస్తామనే అది తమ రిపోర్టులో చెప్పింది.
"మనం వాస్తవాలను ఎదుర్కోవాలి. అందరూ తమ ఆలోచనలను పంచుకోరు. మనం భవిష్యత్తులో ఏం జరిగినా సిద్ధంగా ఉండాలి" అని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఒక వ్యక్తి లక్షణాలను శాస్త్రవేత్తలు సురక్షితంగా మెరుగుపరిచినప్పటికీ.. సైన్యంలో ఆ పద్ధతి ఉపయోగించడం అనేది ప్రత్యేకమైన సమస్యలు సృష్టిస్తుంది.
ఉదాహరణకు ఒక సైనికుడు మిలిటరీ కమాండ్ స్ట్రక్చర్ పరిధిలో ప్రమాదకరమైన చికిత్సకు స్వేచ్ఛగా అంగీకరించగలడా? అనే ప్రశ్న.
చైనా, రష్యా తమ సైనిక దళాలపై కోవిడ్ టీకాను పరీక్షించినట్టు సమాచారం.
"సైన్యం ఉన్నది సైనికుడి ప్రయోజనాలను ప్రమోట్ చేయడం కోసం కాదు. అది వ్యూహాత్మక ప్రయోజనం పొందడానికి, యుద్ధం గెలవడానికి పనిచేస్తుంది. మనం సైనికులకు సృష్టించే ప్రమాదాలకు పరిమితులు ఉంటాయి. కానీ, అవి సామాన్యులకు విధించే వాటి కంటే ఎక్కువగా ఉంటాయి" అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎథిక్స్ నిపుణులు ప్రొపెసర్ జూలియన్ సావులెస్కూ అన్నారు.
"ఎవరైనా ఒక పరీక్ష వల్ల వచ్చే ప్రయోజనాల కంటే, దానివల్ల కలిగే ప్రమాదాలను ఊహించడం చాలా ముఖ్యం. అయితే, సైన్యంలో ఈ సమీకరణ భిన్నంగా ఉంటుంది. వాళ్లు తరచూ ఎలాంటి ప్రయోజనం లేకపోయినా, ప్రమాదాలకు ఎదురెళ్లాల్సి ఉంటుంది" అని చెప్పారు.
సైనికులు యుద్ధంలో చావోబతుకో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉంటారు. ఈ పరిశోధనలు వారికి మనుగడ అందించగలవని నిర్ధరిస్తే, సైన్యంలో అలాంటి అభివృద్ధిని స్వాగతించవచ్చు.
కానీ, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ ఫిలాసఫర్ ప్రొఫెసర్ పాట్రిక్ లిన్ మాత్రం అదంత సులభం కాదంటున్నారు.
"సైన్యంలో సామర్థ్యాలు మెరుగుపరచడం అంటే, మన సొంత పౌరులపైనే ప్రయోగాలు చేసి, వారిని ప్రమాదంలో పడేయడమే అవుతుంది. ఆ పరిశోధనలు సైనికులకు ఎంత మెరుగైన రక్షణ అందిస్తుందో కచ్చితంగా తెలీదు. దానికితోడు అలా జరిగితే సైనికులను మరింత ప్రమాదకరమైన మిషన్లకు పంపవచ్చు. సామర్థ్యాలు మెరుగుపడని వారికి మరిన్ని అవకాశాలు తీసుకోవచ్చు" అన్నారు.
కెప్టన్ అమెరికా ఇప్పుడప్పుడే రావడం జరగదు. కానీ, సైన్యంలో ఆశ్చర్యకరమైన అభివృద్ధికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది.
"సైన్యంలో పరిస్థితులు ఎలా మెరుగుపరుస్తారు అనేదానికి నైతిక నియంత్రణను లేదంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో అదుపు చేయడం చాలా కష్టం. ఎందుకంటే సహజంగా దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి దానిని రహస్యంగా ఉంచుతారు" అంటారు సవులెస్కూ.
అంటే, ఇది కఠినంగా ఉంటుంది. ఈరోజుల్లో సైన్సులో, మెడిసిన్లో అన్నీ బహిరంగంగా ఉన్న సమయంలో అది చాలా కష్టం.
ఈ రంగంలో నియంత్రణకు ఏం చేయచ్చు, లేదా చేయాలి.
ద్వంద్వ ఉపయోగాల కోసం జరిగే ఈ పరిశోధనలు అన్నింటికీ దాదాపు ఒకే ఒక సవాలు ఎదురవుతోంది.
ఉదాహరణకు 'ఎక్సోస్కెలిటన్' పరిశోధనను మొదట ఆరోగ్య సమస్యలు, అంటే పక్షవాతం వచ్చిన రోగులను మళ్లీ నడవడానికి సాయంగా ఉండేలా ప్రారంభించారు.
కానీ, ఈ చికిత్స పద్ధతి సులభంగా ఆయుధంగా మారిపోయింది. అలా జరగకుండా అడ్డుకోవడం ఎలా అనేది స్పష్టంగా తెలీడం లేదు. అంటే, వైద్య చికిత్సల కోసం జరిగే పరిశోధనలను నిరాశపరుస్తున్న విస్తృత నియంత్రణ లేకుండా దానిని ఎలా అడ్డుకోవాలో అర్థం కావడం లేదు.
జన్యు పరిశోధనల్లో చైనా ఇప్పటికే ముందంజలో ఉంది. మిగతా దేశాలు తమకు తాముగా ప్రతికూల పరిస్థితుల్లో పడిపోయాయి అని డాక్టర్ ఓనెల్ అన్నారు.
మనం ఇక్కడ వాస్తవికత మీద దృష్టి పెట్టడానికి బదులు, నైతిక వాదనలతో సమయాన్ని వృథా చేసినట్లు నాకు అనిపిస్తోంది.
"ఏవేవో ఊహించడం మీద ఎక్కువ దృష్టి పెట్టడం కంటే, ఈ సాంకేతికతను ఉపయోగిస్తే ఎదురయ్యే అసలైన ప్రమాదాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడే మనం దానిని మెరుగ్గా అర్థం చేసుకోగలం. ఎందుకంటే, ఆ పరిశోధనలు ఒక రంగం కోసం చేస్తే, వాటిని ఇంకెక్కడో ఉపయోగించాలని అనుకుంటున్నారు. ఎక్కడ తప్పు జరగవచ్చు అనేది మనకు ఈ పరిశోధనలు కొనసాగినప్పుడు మాత్రమే తెలుస్తుంది" అంటారు ఓనెల్.
ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)