మోదీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు రాసిన లేఖలో ఏముంది?

ఫొటో సోర్స్, AFP
ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీ
పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఒక లేఖ రాశారు.
"ఒక పొరుగు దేశంగా ఇండియా ఎల్లప్పుడూ పాకిస్తాన్ ప్రజలతో స్నేహపూర్వక సంబంధాన్ని కోరుకుంటుంది. ఇందుకోసం ఉగ్రవాదం, శతృత్వం లేని నమ్మకం, విశ్వాసంతో కూడిన వాతావరణం అవసరం. కోవిడ్ 19 మహమ్మారితో పోరాడుతూ, సవాళ్లను అధిగమిస్తున్న క్లిష్ట సమయంలో మీకు, పాకిస్తాన్ ప్రజలకు నా అభినందనలు" అని మోదీ ఆ లేఖలో రాశారు.
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా పాకిస్తాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ దేశ రాష్ట్రపతి ఆరిఫ్ అల్వికి లేఖ రాశారు.
ఇరు దేశాల మధ్య నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దగ్గర తాజాగా కాల్పుల విరమణ అమలు అవుతున్న సమయంలో మోదీ, ఇమ్రాన్ ఖాన్కు ఈ లేఖ రాశారు.
కొన్ని నెలల కిందట, రెండు దేశాల్లోని మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్ సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణను అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా చేసిన ఒక ప్రకటనలో.. ఇరు దేశాలూ పాత విషయాలను మర్చిపోయి ముందుకు నడవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్కు ప్రధాని మోదీ రాసిన లేఖ
కాగా, సింధు నదీ జలాల పంపకం విషయమై పాకిస్తాన్ ఇండస్ వాటర్ కమిషనర్ సయ్యద్ మెహర్-ఎ-ఆలం నేతృత్వంలో ఎనిమిది మంది బృందం, భారత బృందంతో దిల్లీలో చర్చలు జరపనున్నారు. రెండేళ్ల తరువాత ఈ చర్చలు జరగనున్నాయి.
ఈ మధ్య కాలంలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఏర్పడుతున్న స్నేహపూర్వక సంబంధాల వెనుక మూడో దేశం జోక్యం ఉండి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇండియా, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి సౌదీ అరేబియా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి ఆదిల్ అల్ జుబైర్ మాటల ద్వారా తెలుస్తోంది.
ఫొటో సోర్స్, DrSJaishankar
భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ను కలిసిన యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జైద్
ఇటీవల అరబ్ న్యూస్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సౌదీ అరేబియా ఈ ప్రాంతం మొత్తంలో శాంతిని కోరుకుంటోందని, అందుకు తగిన ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
ఈ రెండు దేశాల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు కొన్ని వార్తాపత్రికలు కూడా పేర్కొన్నాయి.
అయితే, ఈ విషయాలను భారత్, పాకిస్తాన్లు ధ్రువీకరించనప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న స్నేహ సంబంధాలకు ఇదే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్షాలయ్యారు
- బంగారం మాస్క్: చైనాలో 3 వేల ఏళ్ల కిందటి మాస్క్ దొరికింది
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)