వాతావరణ మార్పులు: మానవాళికి ముప్పు పొంచి ఉందన్న ఐపీసీసీ నివేదిక

ఫొటో సోర్స్, Reuters
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం వల్ల భవిష్యత్తులో మానవాళి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది.
మనుషులు చేపడుతున్న చర్యలే వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయన్నది వాస్తవం అని ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్) శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
వాతావరణ మార్పులపై ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ - ఐపీసీసీ తన నివేదికను విడుదల చేసింది. వాతావరణ మార్పులపై వచ్చిన అతిపెద్ద సమగ్ర నివేదిక ఇదేనని భావిస్తున్నారు.
ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్కు కారణం అవుతున్న ఉద్గారాలు ఇలాగే కొనసాగితే దాదాపు పదేళ్లలోనే భూమి ఉష్ణోగ్రత మరింతగా పెరగొచ్చని ఈ నివేదిక పేర్కొంది.
అలాగే ఈ శతాబ్దం చివరినాటికి సముద్ర మట్టంలో పెరుగుదల 2 మీటర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది.
అయితే గ్రీన్హౌస్ ఉద్గారాలలో కనిపిస్తున్న తరుగుదల ఉష్ణోగ్రతలను స్థిరీకరించగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఫొటో సోర్స్, EPA
ఐపీసీసీ ఏం చేస్తుంది?
ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ), 'వాతావరణ మార్పులు' అంశంలో వెలువడిన వివిధ అధ్యయనాలను పరిశీలించి ఆ సారాంశాన్ని 42పేజీల అధ్యయన పత్రంగా తీసుకువచ్చింది.
ఐపీసీసీ అనేది వాతావరణ మార్పులపై వచ్చిన శాస్త్రీయ అధ్యయనాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఒక అంతర్జాతీయ సంస్థ.
దీన్ని 1988లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ), వరల్డ్ మెటీరలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) సంయుక్తంగా స్థాపించాయి.
వాతావరణ మార్పుల విషయంపై సత్వర చర్యలు చేపట్టేందుకు ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫొటో సోర్స్, Reuters
ఐపీసీసీ రిపోర్టులోని ప్రధానాంశాలు
1850-1900 మధ్య కాలంలో కన్నా 2011-2020 మధ్య కాలంలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత 1.09C ఎక్కువగా ఉంది.
1850వ సంవత్సరం నుంచి పరిశీలిస్తే గత ఐదేళ్లల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
1901-1971 మధ్య కాలంతో పోల్చితే, ఇటీవల సముద్ర మట్టం పెరుగుదల రేటు దాదాపు మూడు రెట్లు పెరిగింది.
1990ల నుంచి హిమనీనదాలు కరిగిపోవడానికి, ఆర్కిటిక్లో మంచు కరిగిపోవడానికి 90% కారణం మానవ తప్పిదాలే.
1950ల నుంచి చూస్తే, ఇటీవల కాలంలో తీవ్రమైన వేడిగాలులు తరచూ వీస్తున్నాయి. మంచు తుఫానుల తాకిడి తగ్గింది. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్నది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తుపై వాతావరణ మార్పుల ప్రభావం
ఉద్గారాలను నియంత్రించకపోతే, 2040 నాటికి ఉష్ణోగ్రతలు 1850-1900 స్థాయిల కన్నా 1.5C పెరుగుతాయి.
2050 లోపల ఒక్కసారైనా ఆర్కిటిక్లో సెప్టెంబర్ మాసంలో మొత్తం మంచు కరిగిపోయే పరిస్థితి వస్తుంది. సముద్ర మట్టం పెరుగుదల/తరుగుదల వలన కలిగే ఉపద్రవాలు గతంలో శతాబ్దానికి ఒకసారి సంభవించేవి.
కానీ 2100 నాటికి, సగానికి పైగా టైడల్ గేజ్ ప్రాంతాల్లో సంవత్సరానికి ఒక్కసారైన ఈ ఉపద్రవాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు పెరిగే ప్రమాదం ఉందని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది.
ఇవికూడా చదవండి:
- జమ్మూ: క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, ఇది ఎందుకు అంత ప్రమాదకరం?
- యూరప్ వరదలు: జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్లు అతలాకుతలం
- చమోలీ గ్లేసియర్ : 15 అణుబాంబులు ఒకేసారి పేలినట్లు ఆ రాయి లోయ అడుగును తాకింది
- ఆస్ట్రేలియా: డెంగ్యూ దోమలపై పోరాడే కొత్త రకం దోమల్ని కనుగొన్న పరిశోధకులు
- క్విట్ ఇండియా ఉద్యమం: ఆ ఊళ్లో ఇంటి పేరును ఆజాద్ అని మార్చుకున్నారు
- ఈ మహిళ ప్రపంచాన్ని చుట్టేశారు
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- 'నువ్వు ఆడపిల్లవి, ఈ పని ఎలా చేస్తావు?' అన్నారు... కానీ 4వేల దహన సంస్కారాలు నిర్వహించాను
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)